నాగర్కర్నూల్, అక్టోబర్ 26: 50 ఏండ్లపాటు మనల్ని అరిగోస పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీని బొందపెడుదామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. పదేండ్ల అభివృద్ధి ప్రస్థానం, ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని పుల్జాల, మల్కాపూర్, గగ్గలపల్లి, మంతటిలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు సతీమణి జమునతో కలిసి మహిళలు బొడ్డెమ్మలు, కోలాటం వేస్తూ స్వాగతం పలికారు. ముందుగా పుల్జాలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం చేపట్టారు. రెండుసార్లుగా భారీ మెజారిటీతో గెలిపించారని.. ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమాలు, మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు.
అనంతరం మలాపూర్లో ప్రచారం చేశారు. గ్రామస్తులకు 10ఏండ్లుగా అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయని, ఒకప్పుడు గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు, తాగడానికే నీళ్లు ఉండేవి కాదు, పశువులకు గడ్డి కూడా దొరకపోయేదని.. ఇప్పుడూ ఏ గ్రామంలో చూసిన పచ్చని పంట పొలాలు, నిండుగా ఉన్న చెరువులతో కళకళలాడుతున్నాయని గుర్తు చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాల్లో పెద్దఎత్తున సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రోడ్లు లేక బజార్లలో నీళ్లు మలిచి బురద ఏర్పడిన వాటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపే వారన్నారు. కానీ ఈ రోజు గ్రామాల్లో ఎకడ చూసినా సీసీరోడ్లు వేశామన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మళ్లీ కష్టాలు వస్తాయన్నారు.
మూడు గంటల కరెంట్ ఇస్తామన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా.. లేక 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేస్తారా మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కారు చీకట్లు కమ్ముకుంటాయని, ఇప్పుడిప్పుడే వెలుగులు వచ్చిన మన జీవితాల్లో మళ్లీ చీకట్లు వస్తాయన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఎంజేఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.15 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అన్ని మౌలిక సదుపాయాలతో కొత్త భవనాలు నిర్మించామన్నారు. తమ ఎంజేఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో సామూహిక వివాహాలు, ఉచిత డ్రైవింగ్ లైసెన్స్, మర్రన్న క్యాంటీన్ పేరుతో రూ.5కే భోజనం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మరింత సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని, కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, ఎంజేఆర్ట్రస్టు డైరెక్టర్ మర్రి జమున, జెడ్పీటీసీ శ్రీశైలం, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
బిజినేపల్లి, అక్టోబర్ 26: మండలంలోని పాలెంలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఎకడాలేని విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాగరాజు, యాదవరెడ్డి, రవీందర్, శంకర్, శివ, శ్రీను ఉన్నారు.
తెలకపల్లి, అక్టోబర్ 26: మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డికి ఓటు వేసి మూడోసారి ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు. పార్టీ మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింహ, లక్ష్మారెడ్డి, రాములు, రమేశ్, ఉపసర్పంచ్ కృష్ణ, సత్యనారాయణ, కాశమ్మతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.