కొల్లాపూర్, డిసెంబర్ 17: నల్లమల కొండల మధ్యన నదీతీరంలో అమరగిరి గ్రామం. కుడివైపు 5కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య మల్లయ్యసెల(శివుడి ఆలయం), ఎడమ వైపు 10కిలోమీటర్ల దూరంలో మరబోటులో నదిపై ప్రయాణం చేస్తే చీమలతిప్ప(దీనిపైనే మూడు దశాబ్దాలుగా 60కుటుంబాలు ఆంధ్ర జాలర్లు నివాసం ఉండే ద్వీపకల్పం ఇదే). ఇక్కడికి సమీపంలో 800మీటర్ల ఎత్తైనా కొండ. ఆ కొండకు కాలినడకన దట్టమైన అటవీప్రాంతం గుండా వెళ్తే పురాతన అంకాళమ్మ కోట వస్తుంది. ప్రతి సోమ, మంగళ, శుక్రవారాలు భక్తులు నదిపై పుట్టిల్లోనూ, మరబోటుల్లోనూ వెళ్లి మొక్కులను చెల్లించుకుంటారు.
అయితే అమరగిరి నుంచి అంకాళమ్మకు బోటులో ప్రయాణం చేస్తే పక్షుల కిలకిలరాగాలు, చుట్టూ పచ్చదనం పరుచుకున్న ఎత్తైనాకొండలు, పెద్ద పెద్ద చెట్లు, ప్రశాంత వాతావరణం నల్లమల సొంతం. తెలంగాణకు మరో ఊటి నల్లమల అని చెప్పవచ్చు. ఆ పక్కనే మరో పర్యాటక ప్రదేశం ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పర్యాటకుల మనసు దోచుకుంటుంది.
అలాగే సోమశిలలో పాత, కొత్త రాతియుగం నాటి కట్టడాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనా లలితాసోమేశ్వరాలయం ప్రత్యేకత. పర్యాటక రంగంలో దూసుకెళ్తున్న సోమశిలలో ఏకో టూరిజం ఆధ్వర్యంలో నది ఒడ్డున ఆధునాతన హంగులతో నిర్మించిన కాటేజీలు, రెస్టారెంట్లు పర్యాటకులకు చక్కని అతిథ్యమిస్తుంది. కాటేజీల్లో సేదతీరుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో కృష్ణమ్మ పరవళ్లు హృదయాలను కట్టిపడేస్తున్నాయి. 50మంది పర్యాటకులు ఉంటే టూరిజంశాఖ ఆధ్వర్యంలో సోమశిల నుంచి నదిపై శ్రీశైలం డ్యాం వరకు లాంచీ ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారు. నదిపై లాంచీ ప్రయాణం జీవితంలో మరుపురాని స్మృతులుగా మిగిలిపోతాయి. అలాగే మంచాలకట్టలో రామతీర్థాలయం, జటప్రోలులో మదనగోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి.