మాగనూరు మే 31: నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక, మట్టి( మొరం), వండ్రు మట్టి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా మండలంలో అక్రమ వ్యాపారం చేస్తున్న వారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన మేరా ఇసుక, మట్టి, ఒండ్రు మట్టికి ప్రభుత్వపరంగా అనుమతులు ఇస్తామన్నారు.
కావున అవసరమైన లబ్ధిదారులు ట్రాక్టర్, టిప్పర్ల యజమానులు అనుమతులు పొందాలని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక అనుమతులు పొందుతున్న ట్రాక్టర్ యజమానులు నిజమైన లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయకుండా ఎక్కువ డబ్బులకు బయట వారికి అమ్ముకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. లబ్ధిదారులకాకుండా ఇసుక పక్క దారి పట్టిస్తున్న ట్రాక్టర్స్ను సీజ్ చేస్తామన్నారు.