ఊట్కూర్, ఆగస్టు 28: ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఓ పోలీసు అధికారి వారించారు. వారిని ఆపిన ఆయన.. బైక్పై ఇంతమంది వెళ్లడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.
ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై చిన్నారితో సహా ఐదుగురు వెళ్లడాన్ని హెడ్ కానిస్టేబుల్ రంజిత్ కుమార్ గమనించారు. బైక్ మీద పరిమితికిమించి ప్రయాణించడం సరికాదని వారిని ఆయన వారించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని వారికి రజింత్ కుమార్ వివరించారు.
అంతేకాదు దయచేసి బైక్పై ఇద్దరికి మించి వెళ్లొద్దని.. దండం పెట్టి మరీ వేడుకున్నాడు. బండిపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని, ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణించవద్దని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని రజింత్ కుమార్ వారికి సూచించారు. పోలీసు అధికారి వినూత్న రీతిలో అవగాహన కల్పించిన దృశ్యం అక్కడి వారిని ఆలోచింపజేసింది. ప్రమాదాల నివారణలో వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు.