నారాయణపేట/నారాయణపేట రూరల్, ఏప్రిల్ 9 : జిల్లా ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించేందుకు కృషిచేస్తామని హైకోర్టు జడ్జి జీ శ్రీదేవి పేర్కొన్నారు. నారాయణపేట కోర్టు సముదాయంలో శనివారం హైకోర్టు జడ్జి మొదటి అదనపు జూనియర్ సివిల్జడ్జి, పస్ట్ క్లాస్ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును నారాయణపేట కలెక్టర్ హరిచందనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ కోర్టులో మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రజలు బెయిల్కోసం మహబూబ్నగర్కు వెళ్లకుండా ఇక్కడే పొందే విధంగా జిల్లా కోర్టు ఉం డడం ఎంతో అవసరమన్నారు. జిల్లా కోర్టు ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారని, జిల్లా కోర్టు ఆలస్యమైతే అదనపు జిల్లా జడ్జి కోర్టునైనా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కోర్టుకు కావాల్సిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ నూతన కలెక్టరేట్ సమీపంలో కేటాయించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున న్యాయవ్యవస్థకు కావాల్సిన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.
మహబూబ్నగర్ ప్రిన్సిపల్ జడ్జి ప్రేమావతి మాట్లాడుతూ జిల్లాల్లో సరైన కోర్టులు, సిబ్బంది లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య చాలా పెరిగిపోయిందన్నారు. పోక్సో కేసుల ట్రయల్స్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును సైతం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక కోర్టులో లైబ్రరీ కోసం సీనియర్ న్యాయవాది కరుణాకర్రెడ్డి రూ.లక్ష చెక్కును హైకోర్టు జడ్జి శ్రీదేవికి అందజేశారు. అంతకుముందు బార్అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు జడ్జికి ఘనంగా స్వాగతం పలికి సన్మా నించారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు , ఫోక్సోకోర్టు జడ్జి ఉమాదేవి, సీనియర్ సివిల్ జడ్జి శుభవల్లి, జూనియర్ సివిల్జడ్జి రాజేందర్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మధుసూదన్రావు, మహబూబ్నగర్ సీనియర్ సివిల్జడ్జి వెంకట్రావ్, సీనియర్ న్యాయవాదులు నాగురావునామాజీ, వెంకట్రెడ్డి, రఘువీర్యాదవ్, మల్లికార్జున్, ఆకుల బాలప్ప, సీతారాం, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.