నారాయణపేట: ప్రాంతీయ పార్టీల సభ్యత్వంలో టీఆర్ఎస్కే దేశంలో నంబర్ 1 స్థానంలో ఉందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క టీఆర్ఎస్ పార్టీకే 60లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ దేశంలో ఒక్క టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు.
అంతేగాక సంస్థాగతంగా కూడా ఎంతో బలంగా టీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. వారం రోజుల నుంచి గ్రామ, పట్టణ, మండల కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వందల గ్రామ పంచాయతీలు, 147మున్సిపాలిటీలు, 600 మండలాల్లో కమిటీలు నియమించడం జరిగిందన్నారు. ప్రతి కమిటీలో 15 నుండి 25 మంది సభ్యులు ఉన్నారని, వీరందరిని రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే 13లక్షల 50వేల మంది కేవలం కమిటీ సభ్యులే అవుతారన్నారు.
పార్టీ ఒక్క పిలుపు ఇస్తే 10లక్షల మంది పదాధికారులు ఒక వేదిక వద్దకు చేరుకోవడం జరుగుతుందన్నారు. వచ్చే రెండు సంవత్సరాల వరకు ఇదే కమిటీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోట్ల రాజ వర్దన్రెడ్డి, గందె చంద్రకాంత్, కన్నా జగదీశ్, బండి శివరాంరెడ్డి, అధ్యక్షుడు విజయ్సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.