మరికల్, ఆగస్టు 29: మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామ ప్రజలకు అండగా ఉంటానని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి (Rajender Reddy) అన్నారు. గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ భూమిలో ఇండ్లు నిర్మించుకున్నారని, వాటిని వెంటనే తొలగించాలంటూ దేవాదాయ శాఖ వారు కోర్టు నుంచి ఉత్తర్వులు పంపించడాన్ని ఆయన ఖండించారు. వందేండ్ల క్రితమే వారు ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్నారని, ప్రభుత్వానికి కరెంటు బిల్లులు, పంచాయతీకి టాక్స్ కడుతున్న గ్రామస్తులకు ఎలా నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించారు. 2018లో 11 మందికి నోటీసులు జారీ చేయగా అప్పటి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో మాట్లాడి పల్లె గడ్డలో ఇండ్లు నిర్మించిన భూమిని గ్రామ కంఠభూమిగా మార్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు.
గ్రామస్తులు అధైర్య పడొద్దని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోర్టు నుంచి నోటీసులు వస్తే సొంతంగా లాయర్ను ఏర్పాటు చేసి పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తానన్నారు. ఈ నెలలో మరో 25 మందికి నోటీసులు రావడంతో వారు భయాందోళన గురవుతున్నారని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఇండ్లతోపాటు పాఠశాల, గ్రామపంచాయతీ భవనాన్ని కూడా నిర్మించారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కూడా కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గౌని సురేఖ రెడ్డి, మరికల్ మండలం మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, సీనియర్ నాయకులు రాజా వర్ధన్ రెడ్డి, సంపత్ కుమార్, మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు మురళి, హనుమంతు, హనుమ రెడ్డి, వీర బసంత్, రామస్వామి, నారాయణ, హచ్ శ్రీనివాసులు, మథిన్, రఘు, తదితరులు పాల్గొన్నారు.