నాగర్కర్నూల్, నవంబర్ 29: విద్యార్థులు శాస్తవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకొని, ప్రతి అంశంలో ఏమిటి ఎందుకు ఎలా అని ప్రశ్నిస్తూ సందేహాలను నివృత్తి చేసుకుంటూ సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూచించారు. జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక గణిత, పర్యావరణ ప్రదర్శనను ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డ్డి, అదనపు రెవె న్యూ కలెక్టర్ మోతీలాల్, డీఈవో గోవిందరాజులుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విద్యార్థులు ఏర్పా టు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మనూచౌదరి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే సృజనాత్మకత అలవర్చుకొని నూతన ఆవిష్కరణ వైపు తమ దృష్టి మళ్లించాలని సూ చించారు. శాస్త్రవేత్త జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తి పొందాలని సైన్స్ఫెయిర్లో చూసిన అంశాలను తిరిగి పాఠశాలలో సైన్స్ల్యాబ్లను ఉపయోగించుకొని ప్రయోగాలు చే యాలన్నారు. విద్యార్థులు ప్రతి అంశంపై ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులను ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, రాబోయే కాలంలో మంచి సైంటిస్టులుగా ఎదగాలని కోరుతూ ఉపాధ్యాయుల ను విద్యార్థులను అభినందించారు.
సమాజం కోసమే సైన్స్ : ఎమ్మెల్యే మర్రి
సమాజం కోసమే సైన్స్, సైన్స్ కోసమే సమాజం అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. వైజ్ఞానిక రంగంలో విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు వైజ్ఞానిక ప్రదర్శన దోహదపడుతాయన్నారు. విద్యార్థులు ప్రదర్శనలు ఎంతగాలో ఆకట్టుకున్నాయని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం డీఈవో గోవిందరాజులు మాట్లాడు తూ భావిశాస్త్రవేత్తలుగా విద్యార్థులు రాణించాలంటే సైన్స్ ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలన్నారు. నేటి ప్రదర్శనలకు 450 ప్రదర్శనలతో విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ప్రతి అంశాన్ని ప్రదర్శన ద్వా రా విద్యార్థులకు వివరిస్తే వాటి ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉంటుందని గుర్తు చేశారు. సైన్స్ అంటే ఒక విభాగం మాత్రమే కాదని, మౌలిక శాస్ర్తాలు, ఐప్లెయిడ్ విభాగాలు, టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, పశువిజ్ఞానం, ఇలా పలు రంగాల్లో సైన్స్ విస్తరించి ఉంటుందన్నారు. వాతావరణం, తుఫానులు పసిగట్టడం, ప్రకృతి విపత్తులను ముందుగానే గణించడం, ప్రమాదాలు సంభవిస్తే ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని తగ్గించడం తదితర వాటిపై విద్యార్థులు దృ ష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్చైర్మన్ బాబురావు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళాప్రదర్శనలు..
జిల్లా సైన్స్ ఫెయిర్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అలరింపజేశాయి. తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శింపజేసిన పలు ప్రదర్శనలను చూపరులకు వివరిస్తూ వాటి పనితనాన్ని వివరించారు.