అచ్చంపేట, నవంబర్ 29: తన తల్లిదండ్రుల వెంట మూడో తరగతి నుంచే వలసవెళ్లి మట్టి పనిచేశానని, తాను 7వ తరగతిలోనే ఎమ్మెల్యే కావాలనే కోరికను బలంగా ఉండేదని అందుకు అనుగుణంగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. ఎమ్మెల్యే కావాలనే బలమైన ఆకాంక్ష కోసం ఉద్యోగాలు వచ్చినా వదిలేశానన్నారు. మంగళవారం మార్నింగ్వాక్లో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ స్డేడియాన్ని సందర్శించారు. స్టేడియంలో వ్యాయామ శిక్షణ పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి వాకింగ్ చేశారు. అభ్యర్థుల కోరిక మేరకు మైదానంలో సొంత ఖర్చుతో హైమాస్ట్ లైట్లు తెప్పించి ఏర్పాటు చేయించారు. నిత్యం ప్రతి అభ్యర్థికీ కోడుగుడ్లు పంపిణీ చేస్తుండడంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. అభ్యర్థులకు వైద్యులను అందుబాటులో ఉంచాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తారాసింగ్ను ఫోన్లో ఆదేశించారు.
మైదానం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఐ అనుదీప్కు సూచించారు. అచ్చంపేటను అంతర్జాతీయ క్రీడా హబ్గా మార్చడమే లక్ష్యంగా ఎన్టీఆర్ స్టేడియం, ఇండోర్ స్టేడియాలకు రూ.2కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. నిత్యం ప్రతిరోజు 3-4గంటలకు మించి నిద్రపోనన్నారు. కష్టపడి పనిచేయడంలో తన నాన్నే తనకు స్ఫూర్తి అన్నారు. ఒక్కసారి కష్టపడితే జీవితంలో నిలదొక్కుకున్నట్లేనని అభ్యర్థులకు సూచించారు. ఎలాంటి సహకారమైన అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విప్ వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, కమిషనర్ బలరాంనాయక్, సీఐ అనుదీప్, ఎస్సై గోవర్ధన్ పాల్గొన్నారు.