నాగర్కర్నూల్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరుగుతున్నది. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త జిల్లాలు ఆవిర్భవించడంతో ప్రభుత్వ దవాఖానలపై పర్యవేక్షణ పెరిగింది. ముఖ్యంగా వైద్యుల పోస్టులు భర్తీ చేసి పీహెచ్సీల్లో 24గంటలు వైద్యసేవలందిస్తూ డెలివరీలు సైతం చేస్తున్నారు. పాము, కుక్కకాటుకు, సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంటున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకూ వైద్యసేవలందుతున్నాయి. నిత్యం దవాఖానకు వచ్చి చికిత్స చేయించుకునే వారిసంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మే, జూన్, జూలై నెలల వారీగా జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల వారీగా వచ్చిన రోగుల సంఖ్యను లెక్కించగా ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలోని పీహెచ్సీలను పరిగణలోకి తీసుకుంటే ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్ జిల్లా మొదటి స్థానంలో, అత్యల్ప ఓపీలో రాష్ట్రంలోనే జోగుళాంబ గద్వాల చివరిస్థానంలో నిలిచింది.
నాగర్కర్నూల్ పరిధిలో జూలైలో 70,320మంది చికిత్స పొందారు. మహబూబ్నగర్లో 55,953, నారాయణపేటలో 46,058, వనపర్తిలో 32,008, గద్వాలలో 26,466మంది చికిత్స చేయించుకున్నట్లు వైద్యశాఖ నివేదికలో తెలిసింది. ఇక నాగర్కర్నూల్లో మూడు నెలలుగా పరిశీలిస్తే మేలో 61,849, జూన్లో 65,719, జూలైలో 70,320మంది ఓపీ విభాగంలో పేర్లు నమోదు చేయించుకున్నారు. మూడు నెలల్లో నల్లమలలోని వటవర్లపల్లి పీహెచ్సీలోనే తక్కువ సంఖ్యలో ఓపీ నమోదవుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో ప్రతినెలా దాదాపుగా 1200వరకు అటు ఇటుగా ఉంటుంది. అలాగే నాలుగు ఏరియా దవాఖానల్లోనూ మరో 2వేల వరకు ఓపీ ఉంటుంది. ఈ సంఖ్యను బట్టి చూస్తే ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందనేది సుస్పష్టం.
మెరుగైన చికిత్స చేయడం వల్లనే..
సర్కారు దవాఖానల్లో సకాలంలో చికిత్స, మందులు, నార్మల్ డెలివరీలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో ప్రజలకు దవాఖానలపై నమ్మకం పెరుగుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో ప్రతినెలా ఓపీలో రోగుల సంఖ్య పెరుగుతున్నది. వటవర్లపల్లి పీహెచ్సీలో ఓపీలు పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఇంటింటికీ వెళ్లి సర్కారు దవాఖానలపై అవగాహన కల్పించాలని సూచించాం. – సుధాకర్లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్ జిల్లా