నాగర్కర్నూల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రైతుబంధుకు వేళైంది. వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలకు ప్రభుత్వం పెట్టుబడి సాయంగా డబ్బులు అందజేయనున్నది. ఇందుకుగానూ వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. మంగళవారం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున జమ కానున్నాయి. తెలంగాణలో నీళ్లులేక, చేతిలో చిల్లిగవ్వ లేక వ్యవసాయానికి దూరంగా ఉన్న రైతాంగాన్ని సీఎం కేసీఆర్ ప్రోత్సహించేలా పలు పథకాలు అమలుచేస్తున్నారు. 2018లో రైతుబంధు పథకం ప్రారంభంకాగా, మొదట ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా 2019 నుంచి రూ.5 వేల చొప్పున అందజేస్తున్నది. గుంట భూమి ఉన్న రైతులకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందుతున్నది. ప్రతి ఏడాది కొత్తగా రైతులను చేర్చుతూ పథకాన్ని కొనసాగిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, 24గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులపై చిత్తశుద్ధిని చాటుతున్నది.
ఈ పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా తాను చనిపోయేంత వరకు ఈ పథకం అమలవుతుందని స్పష్టం చేసిన సీఎం తాజాగా వానకాలం పెట్టుబడుల కింద మంగళవారం నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. దీంతో వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం అర్హులైన రైతులకు ఈ పథకం అమలు కానున్నది. దీనిపై జిల్లాలకు హైదరాబాద్ నుంచి మండలాల వారీగా రైతుల సంఖ్య, ఎంత సాయం అందించే వివరాలు రెండు రోజుల కిందటే చేరాయి. ఈనెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు జరిగి పట్టాదారు పాస్పుస్తకాలు జారీఅయిన భూములకు ఈ సాయం అందనున్నది. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. దీని ప్రకారంగా ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా పెట్టుబడుల సాయం అందనున్నది. ఈ జిల్లాలో 3,01,343 మంది రైతుల ఖాతాల్లో రూ. 377.17 కోట్లు జమ కానున్నాయి. రైతుబంధు డబ్బులు జమ కానుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.