మక్తల్ రూరల్, మార్చి 29 : గుర్తుతెలియని మహిళను హతమార్చి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మండలం ఖానాపూర్ రోడ్డు దగ్గరున్న భీమా కెనాల్ వద్ద దహనమైన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి నారాయణపేట డీఎస్పీ మధుసూదన్రావు, మక్తల్ ఎస్సై రాములు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళ వయస్సు 30-35 ఏండ్లలోపు ఉంటుందని తెలిపారు. ఘటనా స్థలంలో చేతిగాజులు, మహిళలు ఉపయోగించే నశండబ్బి పడి ఉన్నాయని చెప్పారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతామన్నారు. అనంతరం డాగ్స్కాడ్తో విచారణ నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ దవాఖాన మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా, మహిళపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత హత్య చేశారా లేక మరెక్కడైనా హతమార్చి ఇక్కడ దహనం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.