అనుమతులు వెంటనే రద్దు చేయాలి
ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల డిమాండ్
మీ నినాదాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం : అడిషనల్ కలెక్టర్
ధన్వాడ, ఫిబ్రవరి 8 : మండలంలోని గున్ముక్ల మల గుట్టపై మైనింగ్ తవ్వకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే మైనింగ్ తవ్వకాల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మంగళవారం మల గుట్ట వ ద్ద 144 సర్వే నెంబర్లో ప్రత్యేకంగా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. గున్ముక్ల, మంత్రోన్పల్లి, యంనోన్పల్లి, కంసాన్పల్లి గ్రామాల్లో ఇందుకు సంబంధించి అధికారులు ముందస్తు సమాచారం అందించారు. అయితే సేకరణకు ముందు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. తర్వాత పలువురు వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేశారు. గున్ముక్ల నుంచి పలువురు ర్యాలీగా వచ్చారు. మైనింగ్ తవ్వకాలు చేపడితే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని నినదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి మాట్లాడుతూ మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. కాగా ప్రజాభిప్రాయ సేకరణ కు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ బాల్చందర్, సర్పంచ్ చంద్రయ్య, ఎంపీటీసీలు సుధీర్కుమార్, జట్రం గోవర్ధన్గౌడ్, మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు, సచిన్, ప్రవీణ్ కుమార్రెడ్డితోపాటు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తాం..
మల గుట్ట వద్ద చేపట్టబోయే మైనింగ్ తవ్వకాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని ఎంఎస్ నిర్మలామూర్తి మినరల్స్ సంస్థకు చెందిన ప్రతినిధి అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ అనుమతులతోనే మైనింగ్ తవ్వకాలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. మైనింగ్ తవ్వకాలు, బ్లాస్టింగ్కు సంబంధించిన, ఇతర వివరాలను ఆయన సమావేశంలో వివరించారు. వాయు కాలుష్యం నియంత్రణ, శబ్ధ, పర్యావరణం గురించి తెలిపారు.