నాగర్కర్నూల్ : రానున్న విద్యా సంవత్సరం నాటికి నాగర్ కర్నూల్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodara Rajanarasimha ) అధికారులను ఆదేశించారు. శనివారం మెడికల్ కళాశాలను రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna rao), శాసన సభ్యులు , కలెక్టర్ తో కలిసి మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల(Medical College) భవనాన్ని పరిశీలించారు.
ప్రస్తుతం కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పడిన నాగర్ కర్నూల్ వైద్య కళాశాలలో వచ్చే అకాడమిక్ సంవత్సరంలో మరికొంత మంది వైద్య విద్యార్థులు కొత్తగా చేరనున్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో అవసరమైన మేరకు తరగతి గదులు( Class Rooms), హాస్టల్ (Hostel) నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు.
అంతకు ముందు జిల్లా ఆసుపత్రిని సందర్శించి రోగులకు ఇస్తున్న వైద్య సదుపాయం, భోజనం, పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ యూనిట్(ICU Unit), చిన్న పిల్లల ఎన్ఐసీయూ, జనరల్ వార్డులను సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెను ప్రకారం భోజనం అందించాలని సూచించారు. స్థానిక శాసన సభ్యులు కుచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ, కల్వకుర్తి శాసన సభ్యులు కసిరేడ్డి నారాయణ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ శాంత కుమారి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.