కోడేరు, నవంబర్ 18 : మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహాన్ని వేరే స్థలంలో ఎందుకు నిర్మించారని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి అనిల్ప్రకాశ్ మండిపడ్డారు. 13 ఏండ్ల కిందట అ ర్ధాంతరంగా నిలిచిపోయిన హాస్టల్ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ప్రకాశ్ మాట్లాడుతూ 2008లో కోడేరు గ్రామానికి చెందిన మన్నె మోహన్రెడ్డితో సర్వే నెంబర్ 274, 275లో రెండెకరాలను రూ.1.80 లక్షలు వెచ్చించి బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి కొనుగోలు చేసిందన్నారు. అయితే, అధికారులు సదరు స్థలంలో కాకుండా 12వ సర్వేనెంబర్లో భవనాన్ని నిర్మించేందుకు పూనుకున్నారని చెప్పారు. పునాదుల వరకే కట్టి వదిలేయడంతో విద్యార్థులకు సొంత భవనం లేక ఇబ్బందులు పడుతున్నారని గతంలో ఎన్నో సార్లు వినతులు సమర్పించారన్నారు. దీంతో అధికారులు పరిశీలన చేయగా, మోహన్రెడ్డి అమ్మిన చోట కాకుండా వేరే చోట భవనాన్ని నిర్మించినట్లు వెల్లడైందన్నారు. వారం రోజుల్లో భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ వెల్పేర్ జిల్లా అదనపు అధికారి శ్రీధర్, తాసిల్దార్ మల్లికార్జున్రావు, హాస్టల్ వార్డెన్ మహేశ్ పాల్గొన్నారు.