అచ్చంపేట టౌన్, ఏప్రిల్ 5 : తెలంగాణ సాధనలో అమరుల త్యాగం మరువలేనిది.. వలసవాదిని తరిమికొడదాం, స్థానికుడిని ఆదరిద్దామని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అచ్చంపేటలోని బీకే ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన నాగర్కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆర్ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న హామీ ఇంకా అమలుకు నోచుకోలేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తిరగబడుతామన్నారు. గత పదేళ్లు తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని గుర్తు చేశారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బల్మూర్ మండలం మైలారంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ప్రభుత్వం అండతో కొంతమంది అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.
తవ్వకాలను నిలిపి వేయాలని పార్టీ శ్రేణులతో కలిసి శాంతియుతంగా మైలారం బయలుదేరితే ప్రభుత్వం అచ్చంపేట శివారులోనే పోలీసులతో అడ్డుకున్నదని విమర్శించారు. గతంలో సేవ్ నల్లమల పేరుతో కేంద్రం బలవంతంగా యురేనియం తవ్వకాలను జరిపేందుకు ప్రయత్నిస్తే అసెంబ్లీ సాక్షిగా అడ్డుకున్నానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై పగలు, ప్రతీకారాలను పక్కన పెట్టి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. అణచివేతలే ప్రభుత్వ అజెండాగా భావిస్తే దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నా యకులు అభిలాష్రావు, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, పదర జెడ్పీటీసీ రాంబాబునాయక్, వంగూరు ఎంపీపీ భీమమ్మ, లాలయ్యగౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ నరసయ్యయాదవ్, గోపాల్రెడ్డి, పలువురు జెడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.