నాగుల పంచమికి హైందవ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పంచమి నాడు నాగదేవతలను ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది హిందువుల నమ్మకం. నాగ పంచమిని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కర్ణాటకలోని కందుకూరు గ్రామ శివారు తేళ్ల దేవత ఆలయంలో తేళ్ల పంచమి వేడుకలను జరుపుకొన్నారు.
మహబూబ్నగర్ రూరల్, ఆగస్టు 2: మండలంలోని మన్యకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నాగుల పంచమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తేరు మైదానంలోని పుట్టలో అలహరి వంశీయులు, అర్చకులు పాలు పోశారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ, సాయిబాబా ఆలయంలో భక్తులు నాగదేవతలకు క్షీరాభిషేకం చేసి పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 2: నాగుల పంచమి సందర్భంగా అడ్డాకుల మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు అడ్డాకుల, శాఖాపూర్, పొన్నకల్లోని ఆలయాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. మూసాపేట మండలకేంద్రంతోపాటు నిజాలాపూర్, నందిపేట, జానంపేట, తుంకినీపూర్, వేముల, కొమిరెడ్డిపల్లి, సంకలమద్ది తదితర గ్రామాల్లో మహిళలు ఆలయాల్లో పూజలు చేశారు. నాగదేవత విగ్రహాల వద్ద, పుట్టలో పాలు పోసి పూజలు చేశారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, ఆగస్టు 2: నాగుల పంచమిని పురస్కరించుకొని మున్సిపాలిటీలోని శివాలయం వద్ద మంగళవారం మహిళలు నాగదేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పుట్టలో పాలు పోశారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో ప్రజలు పూజలు చేశారు.
ఘనంగా తేళ్ల పంచమి
కందుకూరు గ్రామ శివారులోని తేళ్ల దేవత ఆలయంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో తేళ్ల పంచమి వేడుకలను జరుపుకొన్నారు. నాగుల పంచమి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పుట్ట వద్దకు వెళ్లి నాగుల విగ్రహాలకు పూజలు చేసి పాలు పోయడం చూస్తుంటాం. కానీ, ఈ గ్రామ శివారులోని కొండపై గల ఆలయంలో తేళ్ల రూపంలో విగ్రహాలకు పాలు పోసి నాగుల చవితి మాదిరిగానే తేళ్ల పంచమి జరుపడం ఆనవాయితీ. తేళ్ల పంచమి సందర్భంగా కందుకూరు తేళ్ల గుట్ట వద్దకు వచ్చిన భక్తులు గుట్టపై రాళ్ల కింద ఉన్న తేళ్లను చేతితో పట్టుకొని ఒంటిపై, ముఖంపై, నాలుకపై వేసుకొని యవకులు, చిన్నారులు విన్యాసాలు చేశారు