మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 8 :మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన మైదానంలో రూ.7.79 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాల గ్రౌండ్లో రూ.2.65 కోట్లతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు తుదిదశకు చేరుకున్నాయి. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం రెండో అంతస్తులో ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, ఫర్నీచర్, ప్రత్యేక గదులు, సెంట్రలైజ్డ్ ఏసీ, అధునాతన సౌండ్సిస్టం వంటివి ఏర్పాటు చేస్తున్నారు. బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మిం టన్, బాక్సింగ్,జూడో, టేబుల్ టెన్నీస్, నెట్బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల కోసం ఫ్లోరింగ్ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అలాగే మైదానంలో 40 మీటర్ల మేర స్కేటింగ్ రింగ్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో క్రీడాకారుల ఇండోర్ స్టేడియం కల త్వరలోనే నెరవేరనున్నది. వీటిని జిల్లాకే తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు.
జిల్లాలో క్రీడారంగానికి బాటలు వేగంగా పడుతున్నాయి. జిల్లాలో ఎంతోమంది ప్రతిభ గల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణాభివృద్ధితోపాటు క్రీడాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో క్రీడామైదానా లు శరవేగంగా పూర్తవుతున్నాయి. దీంతో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఇండోర్ స్టేడియం కళ నేరవేరనుంది. మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషి వల్ల జిల్లా కేంద్రానికి తలమానికంగా నిలిచేలా బస్టాండ్ వద్ద ఉన్న ప్రధాన స్టేడియం రూపుదిద్దుకోనున్నది. ఇప్పటికే పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.2.65కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ఇండోర్ పనులు పూర్తి చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దేలా, జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించేలా ఈ మల్టీపర్పస్ స్టే డియాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు.
తుది దశకు చేరుకున్న మల్టీపర్పస్ స్టేడియం
అధునాతన మల్టీపర్పస్ ఇండోర్ మైదానం నిర్మాణానికి రూ. 7.79కోట్లు మంజూరయ్యాయి. మొదటగా రూ.5కోట్లు మంజూరు కాగా, రెండో అంతస్తు నిర్మాణానికి మరో రూ.2.79కోట్లు కేటాయించారు. కాగా అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్ర హరీల నిర్మాణం, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు. రెండో అంతస్తులో ప్రేక్షకులు కూర్చునేందుకు పెవీలియన్లో కుర్చీలు, ఫర్నీచర్, ప్రత్యేక గదులు ఏర్పా టు చేశా రు. పైకప్పు పూర్తి కాగా సెంట్రలైజ్డ్ ఏసీ కండీషన్, అధునాతన సౌం డ్ సిస్టమ్ పనులు చేపడుతున్నారు. ఫ్లోరింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చే స్తున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.2.65కోట్లతో చేపట్టిన మినీ స్టేడియం నిర్మాణం తుది దశకు చేరుకున్నది. ఈ స్టేడియంలో ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్కేటింగ్ రింగ్ను చేయడానికి ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మైదానంలో కనీసం 40 మీటర్ల స్కేటింగ్ రింగ్ ఏర్పాటు కానుంది. మంత్రి నిరంతరం పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
మెరుగైన వసతులు..
మల్టీపర్పస్ ఇండోర్ మైదానంలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. నిష్ణాతులైన వివిధ క్రీడాంశాల శిక్షణకులను నియ మించే ఆస్కారం ఉంది. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, నెట్బాల్, కబడ్డీ, ఖోఖో క్రీడలు సాధన చేయొచ్చు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నీలకు మహబూబ్నగర్ వేదిక కానుంది.
త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం..
జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియాన్ని ఆధునీరించి, వాలీబాల్ అకాడమీని ప్రారంభిస్తాం. త్వరలోనే ఇండోర్ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో చేపట్టిన మరో ఇండోర్ స్టేడియం పనులు చివరి దశకు చేరుకున్నాయి. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు మహబూబ్నగర్ను వేదిక చేస్తాం. అన్ని రంగాల్లో పాలమూరును అభివృద్ధి చేశాం. క్రీడారంగంపై దృష్టి సారిస్తాం..
మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితోనే..
మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషి వల్లే పాలమూరు క్రీడాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఇప్పటికే ప్రధాన స్టేడియం ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. వాలీబాల్, ఆర్చరీ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో, హై జంప్, లాంగ్ జంప్ కోర్టులను ప్రారంభించాం. రూ.7,79కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ పనులు పూర్తయితే ఇండోర్ క్రీడలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. హైదరాబాద్ తరహా ఇండోర్ క్రీడా టోర్నీలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
– శ్రీనివాస్, క్రీడాశాఖ జిల్లా అధికారి , మహబూబ్నగర్