కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య
వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో ఘటన
కుటుంబ కలహాలే కారణం
వీపనగండ్ల, జూలై 8 : కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధనగిరికి చెందిన మంగలి శశికళ (34)కు పెబ్బేర్ మండలం షాగాపూర్ గ్రామానికి చెందిన చందుతో 17 ఏండ్ల కిందట వివాహమైనది. వారికి ఇద్దరు పిల్లలు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన శశికళ పదేండ్లుగా పుట్టింట్లోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నది. భర్త ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్లేవాడు.
కాగా, రెండు వారాల కిందట చందు గోవర్ధనగిరికి వచ్చి అక్కడే ఉన్నాడు. అయితే, బుధవారం రాత్రి కుమారుడు అఖిల్(7)తో కలిసి శశికళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆమె ఆచూకీ కోసం కుటంబసభ్యులు వెతికి.. గరువారం సాయంత్రం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం గోవర్ధనగిరి సమీపంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శశికళ చీర కొంగుకు కుమారుడిని కట్టుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనను చూసి ‘అయ్యో పాపం’ అంటూ స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామన్గౌడ్ తెలిపారు.