మిడ్జిల్, డిసెంబర్ 24 : మండలంలోని మున్ననూర్ గ్రామ సమీపంలో ఉన్న టోల్ప్లాజా వద్ద వాహనదారులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో శనివారం ఉదయం జాతీయ రహదారి-167పై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. టోల్ప్లాజా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా వాహనాలు ఇంట్లోనే ఉన్నా టోల్ప్లాజా వద్ద డబ్బులు కట్ అవుతున్న మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు. శుక్ర, శనివారం రెండ్రోజుల్లోనే సూమారు 30 నుంచి 40 వాహనాలకు డబ్బులు కట్ అయినట్లు వాహనదారులు వాపోయారు.
టోల్ప్లాజా నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇలా జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నిర్వాహకులు టెక్నికల్ సమస్యతో కొన్ని వాహనాల పేరుపై డబ్బులు కట్ అయ్యాయని తెలిపారు. ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇస్తామని వారు నచ్చజెప్పారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రాంలాల్నాయక్ ఇరువర్గాలతో మాట్లాడారు. టెక్నికల్ సమస్య తీరిన తర్వాత టోల్ డబ్బులు తీసుకోవాలని సూచించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వాహనదారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.