ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ ( Ootkur ) మండల కేంద్రంలో మొహరం వేడుకలు( Moharam celebrations ) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంచారు. శుక్రవారం హసన్, హుస్సేన్ పీర్ల సవారిని పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) పీర్ల చావడిని దర్శించుకోగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు.ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. మొహరం వేడుకలు మతసామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి, రైతు బంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, తరుణ్, ఆనంద్ రెడ్డి, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, ఒబేదుర్ రహిమాన్, షేక్ షమీ, హోటల్ ఖాలిక్ పాల్గొన్నారు.