మహబూబ్నగర్ : భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో, మట్టి మిద్దెలలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ఆయా గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాలలోకి వారిని తరలించాలని, కాలువలు చెరువులు వాగులు చెక్ డ్యామ్ల వద్ద వరద ఎక్కువగా ఉన్నందున ప్రజలు అటు వైపు వెళ్లకూడదని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకూడదని చెప్పారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వీలైనంత సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. గత రెండు, మూడు రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలు ఇంకా రెండు, మూడు రోజులు కురిసే అవకాశం ఉన్నందున పిల్లలను తల్లితండ్రులు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని, విద్యుత్ స్తంభాలను తాకకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.