మహబూబ్నగర్ : వెనుకబడిన పాలమూరు జిల్లాలను సీఎం కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడిగిన వెంటనే దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాల కొరిక ఆయిన 100 పడకల దవాఖానను మంజూరు చేస్తూ రూ.35 కోట్లు నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును హైదరాబాద్లో కలిసి కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
దవాఖాన ఏర్పాటుతో ఇక్కడి ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సీఎం కేసీఆర్ సామాన్యుడి చెంతకే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారని ప్రశంసించారు. నాడు ప్రభుత్వ దవాఖానలు అంటే భయపడే జనం నేడు బీఆర్ఎస్ పాలనలో సర్కారు దవాఖానలకు జై కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆధునిక వసతులతో వైద్య శాలను నిర్మించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.