నారాయణపేట/కోయిలకొండ/దామరగిద్ద, నవంబర్ 9 : నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాంచందర్రావుకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిఒక్కరూ ఎంతో మద్దతు తెలుపుతున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కోరారు. కల్లబొల్లి కాంగ్రెస్ను నమ్మితే కష్టాలు ఖాయమన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతుకావడం ఖాయమన్నారు. అంతకుముందు కోయిల్కొండ మండలం మోదీపూర్, శేరివెంకటాపూర్ ఆంజనేయస్వామి ఆలయం, దామరగిద్ద మండలం క్యాతన్పల్లి వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి స్వాతిరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త రవీందర్రెడ్డి పాల్గొన్నారు.