నాగర్కర్నూల్, అక్టోబర్ 9 : రాబోయే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. తన పదేండ్ల ప్రస్థానంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ఇంకా చేయాల్సిన అభివృద్ధిని ప్రజల ద్వారా తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందని, నెలరోజులు నాలుగు మండలాల్లో 430 కిలోమీటర్ల మేర చేపట్టిన యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన పేర్కొన్నారు. సోమవారం బిజినేపల్లి మండలం పాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి రావాలంటేనే భయపడేవారని, తాను అభివృద్ధి చేసినందుకే ధైర్యంగా తిరుగుతూ ఇంకా చేపట్టాల్సిన పనులను తెలుసుకున్నానన్నారు. నియోజకవర్గానికి 4వేల డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా ఇప్పటికే కొందరికి ప్రొసీడింగ్స్ అందజేశామని గుర్తు చేశారు. విద్య, వైద్య పరంగా నాగర్కర్నూల్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
మెడికల్, పాలిటెక్నికల్ కళాశాలలు మంజూరు చేయించామని, ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఊసే లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సీఎం కావడం, నాగర్కర్నూల్లో మర్రి ఎమ్మెల్యేగా గెలవడం తథ్యమని, ఇందుకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు ఢిల్లీ వరకు బాస్లు ఉంటే మాకు ప్రజలే బాస్లన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఇంకా సీట్ల పంచాయితీనే కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ను గెలిపించుకొని ప్రజలు తమ మెడలను తామే నరుక్కోరన్నారు. కేసీఆర్, తనపై ఉన్న నమ్మకంతో 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు వరుసగా గెలిపించారని, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తారని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్యాదవ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్రావు, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులేందర్రెడ్డి, సర్పంచ్, లావణ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.