జడ్చర్ల, జూలై 27 : వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని సంజీవయ్యకాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వర్షానికి కూలిపోయిన సుంకసారి లక్ష్మమ్మ ఇంటిని పరిశీలించారు. అదేవిధంగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముసురు వర్షాలకు పాతబడిన ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. నల్లకుంట వద్ద సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.