వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. వారం రోజులుగా కురుస్తున్న వానలతో ఉమ్మడి జిల్లా తడిసిముద్దవుతున్నది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళ వారం ఉదయం వరకు చిరుజల్లులు మొదలు మోస్తరు వర్షం కురిసింది. ఆత్మకూరులో ఇండ్లలోకి నీరు చేరింది. పంటలు దెబ్బతినగా.. ధాన్యం తడిసింది.. మామిడి నేలరాలింది. ఈదురుగాలులకు షెడ్లు కూలిపోగా.. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేటీదొడ్డి మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పరిశీలించారు.
కేటీదొడ్డి, మే 2 : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. మండలంలోని గంగన్పల్లి, కొండాపురం గ్రామాల్లో వరి పైరుతోపాటు మామిడి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. జరిగిన నష్టంపై ఆరా తీసి వెంటనే వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డికి ఫోన్లో సమస్యను వివరించారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించి సీఎం కేసీఆర్తో సమావేశమై ఉపశమన చర్యలకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జరిగిన నష్టానికి అన్నదాతలు అధైర్యపడొద్దని.. రైతునేత సీఎం కేసీఆర్ ఉండగా దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. కచ్చితంగా నష్టపరిహారం అందే లా సీఎంకు నివేదికను అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ఎంపీపీ రామకృష్ణనాయుడు, సర్పంచ్ సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకుడు చక్రధర్రావు, రైతులు, అధికారులు ఉన్నారు.
మహ్మదాబాద్, మే 2 : రైతులకు మేలు చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మహ్మదాబాద్ మండలం వెంకట్రెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. ప్రభుత్వానికి వ్యవసాయరంగంపై చిత్తశుద్ధి ఉందని.. అందుకే సాగునీటిని అందించేందుకు ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చిందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, ఏపీఎం సునీత, తాసీల్దార్ ఆంజనేయులు, సర్పంచులు శమంతకమణి, నీలేశ్నాయక్, కిరణ్ కుమార్రెడ్డి, రాఘవేందర్, మాజీ సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి, నాయకులు గోపాల్రెడ్డి, నర్సింహులు, శ్రీకాంత్రెడ్డి, రాంరెడ్డి, బాలవర్ధన్రెడ్డి ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి, మే 2 : మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శాంతినగర్లో ఎమ్మెల్యే అబ్రహం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. రైతులు అధైర్యపడొద్దని సూచించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారని.. వారిని కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. శాంతినగర్, కొంకల, మాన్దొడ్డి, రాజోళి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు డీఎం భాస్కర్రెడ్డి, సహకార అధ్యక్షుడు గోపాల్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణ, ఎంపీపీ రజితమ్మ, జెడ్పీటీసీ కాశపోగు రాజు, కౌన్సిలర్ మాణిక్యం రవి, నాయకులు సీతారామిరెడ్డి, శ్రీనివాసులుగౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, డీలర్ శ్రీను, ఏఈవోలు, సహకార డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.