మల్దకల్, డిసెంబర్ 25 : మల్దకల్లోని ఆదిశిలా క్షేత్రంలో ఆదివారం అర్ధరాత్రి భక్తుల గోవింద నామస్మరణ మధ్య శ్రీలక్ష్మీ, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. వేదపండితులు ప్రసన్నాచారి, ప్రమోదాచారి, మధుసూదనాచార్యులు, రవిచారి, శ్రీధర్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణలతో అశేషంగా తరలివచ్చిన భక్తజనుల మధ్యస్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణానికి ముందుస్వామి వారిని గజవాహనంపై గ్రామంలోని దశమికట్ట వరకు ఊరేగించి అక్కడ స్వామివారి లగ్నపత్రికను ప్రజలకు చదివి వినిపించి ప్రతిఒక్కరూ వివాహానికి హాజరుకావాలని ఆహ్వానం పలికారు. అనంతరం వేదికపైన కనుల పండువగా స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దంపతులు హాజరై పట్టు వస్ర్తాలను సమర్పించారు.
ఎమ్మెల్యేను చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం అనంతరం స్వామివారి శేషవస్త్రంతో ఎమ్మెల్యేను సన్మానించి తీర్థప్రసాదాలు పంపిణీ చేసి ఆశీస్సులు అందజేశారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయ గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై కల్యాణ్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్కుమార్, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ తిమ్మారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డితోపాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు.