రాజోళి, ఫిబ్రవరి 12: ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలు చేస్తున్నదని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రకటనలో పేర్కొన్నారు. రైతు సుభిక్షమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు. నడిగడ్డలో పంటలకు నీరు అందకపోవడంతో సాగుచేయలేక బీడుపారుతున్న సమయంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. గత పాలకులు నడిగడ్డ ప్రాంతాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవని విమర్శించారు.
ప్రభుత్వ పథకాలతో రైతులు సంబురంగా సాగు చేస్తుంటే కొందరు నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వారికి రైతులే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. పంటలు ఎండిపోతున్నాయని తుమ్మిళ్ల ఎత్తిపోతల మోటార్లను ఆన్ చేయాలని రైతుల విన్నపంతో స్పందించినట్లు చెప్పారు.
శనివారం ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదివారం నీటి విడుదలను ప్రారంభించినట్లు తెలిపారు. తుమ్మిళ్లఎత్తిపోతలకు ప్రస్తుతం 3,200 క్యూసెక్కుల నీరు అందుతుందని, దాదాపుగా 27 డిస్టిబ్యూటర్ వరకు రైతులకు నీరు అందుబాటులో ఉందని డీఈ జయప్రకాశ్ తెలిపారు. 20వ తేదీ వరకు ఇదే ఇండెంట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా రాజోళి మండల రైతులు ఎమ్మెల్యే అబ్రహంకు ధన్యవాదాలు తెలిపారు.