గద్వాల, జనవరి 30 : ప్రపంచశాంతికి మార్గదర్శి మహాత్మాగాంధీ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ప్రదాత గాంధీజీ అని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చింతలపేటలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ తన చివరి శ్వాస వరకు శాంతి, అహింసా మార్గాలను ప్రచారం చేశాడన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహనీయుడన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని భావించిన వ్యక్తి అని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నాయకుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.