గద్వాల, నవంబర్ 28: ప్రచారం చివరి రోజులో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంగళవారం గద్వాలలో రోడ్ షో నిర్వహించారు. కిష్టారెడ్డి బంగ్లా నుంచి ప్రారంభమైన రోడ్ షో గాంధీచౌక్ మీదుగా పాతబస్స్టాండ్కు చేరుకోగా పట్టణంలోని వీధులన్నీ జనసంద్రమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల బిడ్డలు పౌరుషం గలవారని, పరాయి వ్యక్తులొచ్చి ఇక్కడ పెత్తనం చేస్తామంటే సహించరని స్పష్టం చేశారు.
“గత ఎన్నికల్లో నా విజయానికి మీరు కారణమయ్యారు. 2018 ఎన్నికల్లో మీరు ఆశీర్వదించడం వల్లే ఎమ్మెల్యేనయ్యా. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నా. మా బలం, బలగం మీరే” అని పేర్కొన్నారు. రోడ్ షోలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్చైర్మన్ బాబర్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్రెడ్డి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.