అలంపూర్, జూలై 20 : కాంగ్రెసోళ్ల పాలనలో అమావాస్య(చీకటి) బతుకులు గడిపామని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో పౌర్ణమి(వెలుగులు)ని చూస్తున్నామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో మూడు గంటల విద్యుత్పై రైతువేదికలో గురువారం నిర్వహించిన రైతు సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మూడు గంటల విద్యుత్, 24 గంటల విద్యుత్ సరఫరాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాణ్యత లేని విద్యుత్ కారణంగా మోటర్లు కాలిపోయి రైతులు ఇబ్బంది పడేవారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లో కరెంటు కోతలు, విద్యుత్ బిల్లుల వాతలు, మోటర్ల మోతలు నేటికీ తప్పడం లేదన్నారు. వ్యవసాయం చేసేటోళ్లకు మూడుగంటల కరెంటు ఏ మూలకూ చాలదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నర్సన్గౌడ్, ఎంపీటీసీ జ్యోతి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ధనుంజయ, సర్దార్, రంగస్వామి, ఆంజనేయులు, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మూడు’ ముచ్చట బాగలేదు
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు అనడం బాగాలేదు. బీఆర్ఎస్ అంటే రైతుకు సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాను. నాకు ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యత్వం లేదు. వాస్తవం చెప్పాలంటే ఎవుసం చేసే రైతులకు ప్రభుత్వం ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం చాలా మంచి ఆలోచన.
– సుజుకి రాముడు, రైతు, లింగనవాయి