పత్తి ఎంత పండిస్తే అంత లాభమే..
వ్యవసాయానికి రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
మోటార్లకు మీటర్లు లేకుండా రైతులకు కరెంట్
కుల, మత పిచ్చిగాళ్లను భూస్థాపితం చేయాలి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
బండి కింది కుక్క ‘బండి సంజయ్’
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
‘ప్రస్తుత వ్యవసాయంలో పంట మార్పిడి అనివార్యం.. పత్తి ఎంత పండిస్తే అంత లాభం.. రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వం మాది.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టని విధంగా వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు కేటాయించాం.. రైతుకు మించిన శాస్త్రవేత్తలు లేరు.. వ్యవసాయ శాఖకు గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే’.. అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మహ బూబ్నగర్లోని జేజేఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన ‘వానకాలం సాగుకు’ సన్నాహక సమావేశానికి మంత్రులతోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, వనజ, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ రఘునందన్రావు, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, వాల్యానాయక్ హాజరయ్యారు.
నాగర్కర్నూల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే అ ని, ఓ రైతు ముఖ్యమంత్రిగా ఉన్నది కేసీఆరేనని.. దేశం లో ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టని విధంగా ఒక్క వ్యవసాయానికే రూ.3.75 లక్షల కోట్లు వెచ్చించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. కులం, మతం పేరుతో చిచ్చు రేపుతున్న బీజేపీ, కాంగ్రెస్లు పేదల బాగోగులను పట్టించుకోకుండా ప్రజలను అవమానపరుస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. వ్యవసా య శాఖకు గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్హాల్లో శుక్రవారం పార్లమెంటరీ పరిధి వ్యవసాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఏ రంగంలో పె ట్టుబడులు పెట్టినా లాభాలు కష్టమన్నారు. కేవలం వ్యవసాయం కోసమే రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లలో ప్రభు త్వం రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. దేశం లో ఏ రాష్ట్రంలో ఇలా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో గంజిలేని దుస్థితిని అధిగమించామన్నారు. గతంలో కృష్ణా, గోదావరిలో నీళ్లున్నా పంటలు పండించుకోలేకపోయామని, తెలంగాణ వచ్చాక కాళేశ్వరంతోపాటు పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి చేసుకున్నామని, రైతుబంధు, రైతుబీమా, ని రంతర ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలతో అన్నదాతలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 83 నియోజకవర్గాలకు సాగునీరందుతున్నదని, మిగిలిన ప్రాంతాలకు సైతం నీళ్లు అందించేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతుకు మించిన శాస్త్రవేత్తలు లేరన్నారు. ప్రభుత్వ విధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. ఒక్క చిన్న గ్రామంలో పండుగ చేస్తే రూ.3 కోట్లు, అదే పెద్ద గ్రామంలో అయితే రూ.6 కోట్ల వరకు ప్రజలు ఖర్చు చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపా రు. ఆర్థిక శక్తి వృద్ధిరేటు విషయంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉందన్నారు. రైతు వేదికల్లో భూసారం నుంచి పంటల ఎంపిక, సాగు, కొనుగోలుపై రైతులకు నిరంతరం శిక్షణ ఇవ్వాలన్నారు. మల్బరీ తోటలతో కూడా అధిక లాభాలు ఉంటాయన్నారు. పామాయిల్ సాగు ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు చేరుకున్నదన్నారు. దేశంలో నూనె దిగుమతికి కేంద్రం రూ.90 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. పామాయిల్ సాగు చేస్తే తెలంగాణ సర్కార్కు సెల్యూట్ చేసి మరీ కేం ద్రం కొనుగోలు చేస్తుందన్నారు. ఆముదం పంటకు అంతర్జాతీయ మార్కెట్ ఉందని, పంటల మార్పిడి ప ద్ధతి అనివార్యంగా పాటించాలని సూచించారు. వరి త ప్పా ఏ పంట వేసినా లాభం వస్తుందన్నారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి పంటల సాగు చేపట్టాలన్నారు. యాసంగిలో వరి వేస్తే మరింత అనర్థదాయకమన్నారు. మనసుపెడితే వ్యవసాయానికి మించిన స్వయం ఉపాధి లేదని, పెట్టుబడి ఖర్చులు తగ్గించి, ఎక్కువ దిగుబడులు సాధిం చే మార్గాలను అన్వేషించాలని కోరారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, వనజ, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్రావు, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, వాల్యానాయక్, కలెక్టర్లు వెంకట్రావు, హరిచందన, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు వెంకటేశ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పిచ్చోళ్లను భూస్థాపితం చేయాలి..
వరి, పత్తి కంటే మంచి పంటలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గత పాలకులు వ్యవసాయం ఇక్కడ ఉంటే యూనివర్సిటీలు ఇతర ప్రాంతాల్లో పెట్టారన్నా రు. నీళ్లు, నదులు తెలంగాణ నుంచే వెళ్తుంటే కరెంట్ వ్యవసాయం మనది, కాల్వల సేద్యం ఆంధ్రాలో జరిగేదన్నారు. మనం బతకాలని నాటి పాలకులకు లేదన్నారు. కనీసం కరెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి ఏడాది 70 శాతం నీళ్లు సముద్రం లో కలుస్తున్నాయన్నారు. నాడు చెరువుల్లో లొట్టపీసు చెట్లను కొట్టి ఎవరో బిల్లులు తీసుకునేవారన్నారు. ఒక్క చెరువులో కూడా పూడిక తీయలేదన్నారు. నాడు గొప్పగా ఉన్న కులవృత్తులు చెదిరిపోయాయని, ఊరును బతికించిన కుటుంబాలు చితికిపోయావన్నారు. పరిపాలన దాహం, తెలంగాణపై పగతో మనను నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఓ రైతు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఏపీ, పంజాబ్లో మోటార్లకు మీటర్లు పెడుతున్నారని విమర్శించారు. కరెంట్ను కేంద్రం ఇవ్వడం లేదన్నారు.
రైతు ఒక్కడే నిజాయితీపరుడన్నారు. రాష్ట్రం నుంచి రూ.56 వేల కోట్లు పన్నుల రూపంలో ఇస్తుంటే.. కేంద్రంలోని పాలకులు పేర్లు మార్చి సగం కూడా ఇవ్వకుండా తామే చేస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కరెంట్ ఆఫీస్ ముందు రోజూ 20, 30 ట్రాక్టర్లు, ట్రాన్స్ఫార్మర్ల లైన్ కనిపించేదన్నారు. వరి పంటను కొంటామన్న బీజేపీ నేతలు ఎక్కడైనా కనిపిస్తున్నారా.. కాంగ్రెస్ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. రైతులు ఈ విషయాలన్నింటినీ గుర్తించాలన్నారు. మా కులం నాయకుడికే ఓట్లు వేయండని.. కులం చూస్తే ఓట్లు పడతాయా, నాయకులు అవుతారా అని రేవంత్రెడ్డి తీరును విమర్శించారు. ఇక మరో నాయకుడు మత ప్రచారం చేస్తూ హైదరాబాద్, మహబూబ్నగర్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడన్నారు. కులం, మతం పిచ్చోళ్లను భూస్థాపితం చేయాలన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తాము ఎదుర్కొంటామన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు రైతు సమితి సభ్యులకు వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. కోర్టు కేసు పూర్తికాగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ ఎనిమిదేండ్లలో రైతుబంధు మహబూబ్నగర్, నారాయణపేటలో రూ.1,486 కోట్లు, రూ.1,679కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు.
రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం
వ్యవసాయానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కే సీఆర్దే అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2,600 మంది ఏఈవోలు రైతులకు సలహాలు, సూ చనలిస్తూ తలలో నాలుకలుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల బోర్లకు మీటర్లు పెట్టకుండా నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నా రు. దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం కూడా రైతులకు అమలు చేయని విధంగా రైతుబంధు ద్వారా రూ.50,500 కోట్లు నేరుగా ఇచ్చామన్నా రు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేం ద్రం బిల్లులను ఆపుతుందన్నారు. ఈ నెల 28 నుం చి రైతుబంధు ద్వారా రూ.7,800 కోట్లను అందజేస్తామన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి పాత పురాణాన్ని కొత్తగా చెబుతున్నారన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో రైతు డి క్లరేషన్ ద్వారా చేసిన ప్రకటనను అమలుచేసి తెలంగాణ రైతాంగా న్ని నమ్మించాలని హితవు చెప్పారు. రేవంత్ మాటలను నమ్మే పిచ్చోళ్లు తెలంగాణలో లేరని, రైతుల ఆత్మహత్యలపై పార్లమెంట్లో రేవంత్కు స్పష్టంగా థోమర్ సమాధా నం ఇచ్చారన్నారు. తెలంగాణ రాకముందు 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. 2020లో కేవలం 400 మంది ఉన్నారని.., ఆ తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు.
రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని అన్నా రు. రాష్ట్రంలో 83 వేల మందికి రైతుబీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున చెల్లించామన్నా రు. రైతు చనిపోవడం వేరు, ఆత్మహత్యలు వేరన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని కాం గ్రెస్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. గత యాసంగిలో వరి వద్దని చెప్తే బండి సంజ య్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వేయమన్నారన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా బీజే పీ, కాంగ్రెస్లు దుష్ప్రచారం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనతో 54 లక్షల ఎకరాలకుగానూ 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైతే కేంద్రం కొనకుండా బీజేపీ నేతలు అడ్డుపడ్డారన్నారు. చివరకు తెలంగాణ ప్రభుత్వమే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చే సిందన్నారు. తాము ఒత్తిడి చేస్తేనే రాష్ట్రం కొన్నదని బీజేపీ అసత్య ప్రచారాలకు తెరలేపిందని మండిపడ్డారు. ‘ఎడ్ల బండి కింద పోయే కుక్క నేనే బండిని మోస్తున్నదని అనుకున్నట్లు’గా బండి సంజయ్ బండి కింది కుక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుబంధు సమితి కార్యకర్తలకు గౌరవ వేతనంపై సీఎంతో చర్చిస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రైతుబంధు సమితికి ప్రోటోకాల్ కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిందన్నారు. రైతువేదికల నిర్వహణకు ప్రతినెలా రూ.9 వేలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత చేస్తున్న ప్రభుత్వానికి రైతాంగం అండ, ఆశీర్వాదం ఉండాలన్నారు. వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. జూరాల నుంచి నీళ్లు ఎట్ల వస్తున్నయ్, కృష్ణా నీళ్లు ఎప్పుడు వదలాలి, ఏ లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలని ప్రతిరోజూ సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారన్నారు.