గద్వాల, ఫిబ్రవరి 22 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గిరిజన తండాకు మహర్దశ పట్టిందని, గిరిజన తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. నేడు తండాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, వేలాది మంది గిరిజనులకు సర్పంచ్ పదవులు దక్కాయన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ కార్యాలయ ఆవరణలోని వేంకటేశ్వర స్వామి కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితోపాటు మంత్రి పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బంజారాల సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్ధారుకుడైన సేవాలాల్ మార్గం ఆచరణీయమన్నారు. తండాలను జీపీలుగా మార్చడంతోపాటు మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రిజర్వేషన్లతో సహా అన్నింట్లో సీఎం కేసీఆర్ గిరిజనులకు అండగా నిలిచారని చెప్పారు.
మన తండా.. మన రాజ్యం : ఎమ్మెల్యే
గతంలో ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన పార్టీలు గిరిజనులను కేవలం ఓటువేసే యం త్రాలుగా మాత్రమే భావించాయని గద్వాల ఎమ్మెలే బండ్ల ధ్వజమెత్తారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ తండాల అభివృద్ధికి నడుం బిగించారని గుర్తు చేశారు. మా తండా.. మా రాజ్యం.. అన్న విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేయడంతోపాటు గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. తండాల్లోని విద్యార్థులు బాగా చదవాలనే ఆలోచనతోనే ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. కేటీ దొడ్డి మండలంలో గురుకులం ఏర్పాటు చేశామన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. శుభకార్యాలు, సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో భూమిని కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, మాజీ జెడ్పీ చైర్మర్ బండారి భాస్కర్, గిరిజన సంఘం నాయకులు సురేశ్నాయక్, జయరాములు, మనెప్ప తదితరులు పాల్గొన్నారు.