మహబూబ్నగర్: పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం వద్ద శాంతానారాయణగౌడ్, లక్ష్మీ వేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించాలని సంకల్పించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి.. మే 7న వివాహాలకు ముహూర్తం ఖరారు చేశామన్నారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పేద జంటలకు ఉచితంగా వివాహాలు జరిపిస్తామని చెప్పారు.
ఈ మేరకు మన్యంకొండ దేవస్థానంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఇందు కోసం పేదింటి జంటలు ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని, వధూవరులకు పట్టువస్ర్తాలు, పెండ్లికి కావాల్సిన సామగ్రిని ఉచితంగా సమకూరుస్తామని చెప్పారు. అవసరమైతే తన సతీమణితో కలిసి కన్యాదానం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. వంద మందికి ఒకేసారి పెండ్లిండ్లు చేసేలా మన్యంకొండ ఆలయం వద్ద పెద్ద హాలు నిర్మిస్తున్నామని, అలాగే ఏసీ కల్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పెండ్లిళ్లు చేసుకున్న జంటలు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని గుట్టపై ఒకరోజు ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రూ.25 కోట్లతో నిత్యాన్నదాన సత్రం, 20 గదులతో వసతి కేంద్రం, రూ.5 కోట్లతో ప్రసాదం కౌంటర్ను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. సామూహిక వివాహాలను ప్రతి ఏటా నిర్విఘ్నంగా నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది జిల్లావ్యాప్తంగా, ఆ తర్వాత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా, చివరగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు సామూహిక వివాహాలు జరిపిస్తామని చెప్పారు.
మన్యంకొండ ఆలయ పరిసరాల్లో నందనవనం
మన్యంకొండ ఆలయానికి 320 ఎకరాల భూమి ఉన్నదని, అందులో అద్భుతంగా నందనవనం తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. గుట్టకింద ఉన్న అలివేలు మంగతాయారు ఆలయం వద్ద విశాలమైన స్థలంలో టెంపుల్ టూరిజంకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి రోప్వే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, మూడు మల్టీనేషనల్ కంపెనీలు టెండర్లు వేశాయని, త్వరలో వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నేరుగా గర్భాలయం వరకు వెళ్లడానికి రోప్వే ఉపయోగపడుతుందని, కొండ మధ్య నుంచి లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ కిశోర్, బీఆర్ఎస్వీ నాయకుడు సుదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.