మహబూబ్నగర్, మే 29 : పదేండ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రగతిని విశ్వవ్యాప్తం చేద్దామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అవతరించి పదేండ్లు పూర్తవుతున్న తరుణంలో నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను పాలమూరుతోపాటు నారాయణపేట జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. గడిచిన తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగామని.. సాధించిన విజయాలను ప్రతిఒక్కరికీ తెలియజెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలన్నారు.
ఉపాధితోపాటు ఉద్యోగం, వ్యవసాయం, వైద్యం, కలెక్టరేట్ల నిర్మాణంతో పాటు ఎన్నో రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుకున్నామన్నారు. రోజు వారీగా నిర్వహించే కార్యక్రమాలపై మంత్రి పలు సూచనలు చేస్తూ.. ఉత్సవాలను అధికారులు తమదిగా భావించి నిర్వహించాలన్నారు. అందరూ హెడ్క్వార్టర్లోనే ఉండాలని, బాగా పనిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానిస్తామన్నారు. అన్ని శాఖలు గత తొమ్మిదేండ్లల్లో సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో తయారు చేసి జూన్ 2లోపు అందరికీ అందజేయాలన్నారు. తెలంగాణ రైతు దినోత్సవం రోజునుంచి జూన్ 22వ తేదీ వరకు అన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి శాఖ ద్వారా నాడు.. నేడు పరిస్థితిని ఫొటోల ద్వారా వివరించాలని తెలిపారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకుగాను అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రవినాయక్ వివరించారు. జూన్ 2వ తేదీన అమరవీరుల స్తూపానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళులు అర్పిస్తారని, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారన్నారు. ఇప్పటికే దశాబ్ది ఉత్సవాల్లో రోజు వారీగా నిర్వహించే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వివరించామన్నారు. అందరి సహకారం తీసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామన్నారు.
ఘనంగా నిర్వహించుకుందాం- ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
రాష్ర్టాన్ని కష్టపడి అభివృద్ధి చేసుకున్నామని, చేసిన పనులకు ప్రజలకు వివరించేందుకు ఇదొక మంచి అవకాశమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలను కలుపుకొని పోతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
అభివృద్ధి దేశమంతా విస్తరించాలి: ఎమ్మెల్యే చిట్టెం
రాష్ట్రంలో సాధించిన ప్రగతిని.. దేశమంతా జరిగేలా ప్రజలందరికీ తెలియజెప్పాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్రెడ్డి అన్నారు. ఇందుకు అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని ఆధారంగా చేసుకొని.. అభివృద్ధిలో అన్ని రాష్ర్టాలుతో పోటీపడి ముందున్నామని అందరికీ తెలియజేయాలన్నారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే పట్నం
పట్టణ, గ్రామాల్లో ప్రత్యేకంగా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రజలకు జరిగిన అభివృద్ధి..జరుగబోయేది వివరించేందుకు ఇది మంచి సమయమన్నారు. కార్యక్రమంలో నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష, మహబూబ్నగర్, నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణాసుధాకర్రెడ్డి, వనజ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ కే.వెంకటయ్య, మూడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్లు కేసీ.నర్సింహులు, బస్వరాజు, లక్ష్మి, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్లు సీతారామారావు, మయాంక్మిట్టల్, అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.