మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 4: అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని, నిధులను అందజేసి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కుర్వ సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవనం నిర్మించుకునేందుకు జిల్లాకేంద్రంలోని ఎదిర శివారులో అత్యంత విలువైన ఎకరా స్థలాన్ని కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కుర్వ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు భూమి కేటయింపునకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని మంత్రి అందజేశారు. కుర్వ సామాజిక వర్గానికి అన్నివిధాలుగా ఉపయోగపడేలా కుర్వ కన్వెన్షన్ హాల్ నిర్మించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో కుర్వ సంఘం నాయకులు నరింహులు, శ్రీశైలం, బాలరాజు, ఎల్లయ్య, శ్రీశైలం, నరేశ్, కృష్ణయ్య, రాములు, రవి పాల్గొన్నారు.
తెలంగాణలో అన్నివర్గాల సంక్షేమం
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 4: అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వధ్యేయమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీలోని 3వ వార్డు ఎనుగొండ పరిధిలో బీసీ కాలనీ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంతిర మాట్లాడుతూ పండుగ పూట ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చీరెలు పంపిణీ చేస్తున్నారన్నారు. తొమ్మిదిరోజులపాటు జరిగే బతుకమ్మ పండుగను మహిళలు సంబురంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మాజీ కౌన్సిలర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పాలమూరును నెంబర్ వన్ చేస్తాం
పాలమూరు, అక్టోబర్ 4: విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పాలమూరు జిల్లాను నెంబర్ వన్ చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నూతంనంగా ఆడిటోరియం నిర్మాణానికి రూ.5కోట్లు, ఎదిర శివారులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి రూ.25కోట్లు నిధులకు సంబంధించిన జీవో కాపీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఏనుగొండలో ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఈ మేరకు ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతికి మంత్రి ఉత్తర్వుల కాపీని అందజేశారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు ఆడిటోరియం లేక అనేక ఇబ్బందులు పడ్డామని, తమ చిరకాల కాంక్ష నెరవేరిందని ఈ సందర్భాంగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.