మహబూబ్నగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండను సకల వసతులతో ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. వెంకటేశ్వర హరిత హోటల్, ఆధునిక హంగులతో ఏర్పాటు చేసే కల్యాణ మండపాన్ని ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ వద్ద రూ.15కోట్లతో చేపట్టిన బడ్జెట్ హరిత హోటల్, కల్యాణ మండపం పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగితే భక్తులకు స్నానం చేసేందుకు కూడా నీళ్లు ఉండేవి కాదని.. తాగడానికి మంచినీళ్లు దొరకని దుస్ధితి ఉండేదన్నారు. కృష్ణానదిలో మునులు స్నానం చేస్తుండగా మూలవిరాట్ విగ్రహం దొరికిందని.. అలాంటి పవిత్రమైన విగ్రహాన్ని ఇక్కడకు తీసుకొచ్చారన్నారు.
అంతకుముందే స్వామివారు స్వయంభూగా వెలిశారని.. ప్రతి రోజూ మూలవిరాట్తోపాటు స్వయంభూగా వెలిసిన స్వామివారిని కృష్ణాజలాలతో పునీతం చేయాలనే సంకల్పంతో సమీపంలోనే మిషన్ భగీరథ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. భక్తులు కృష్ణాజలాలతో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో కోనేరులోకి భగీరథ నీటిని తరలిస్తున్నామన్నారు. 18 ఏసీ, 18 వసతి గృహాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి రోప్వే సౌకర్యాన్ని కల్పించబోతున్నామని చెప్పారు.
ఏడాదిలోపే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే ఏడాది ఇదే కల్యాణ మండపంలో పేదలకు ఉచితంగా సామూహిక వివాహాలు జరపుతామన్నారు. కొండ సమీపంలో వేంకటేశ్వర పార్కుతోపాటు భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మన్యంకొండ సమీపంలో నిరాదరణకు గురైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
అక్కడ నిత్యపూజలు జరుగుతున్నాయని.. భక్తులు అధికసంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో మన్యంకొండ ఆలయం పర్యాటక ప్రదేశంగా మారుతుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఆలయ చైర్మన్ అలహరి మధుసూదన్, ఎంపీపీ సుధ, వైస్ఎంపీపీ అనిత, బీఆర్ఎస్ నాయకులు గిరిధర్రెడ్డి, గణేశ్, రవీందర్రెడ్డి, టూరిజం డీఈ పరుశవేది, ఏఈ మధు, తాసీల్దార్ పాండు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.