మహబూబ్నగర్/రూరల్, జూలై 27 : ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో ఎంవీఎస్ఎన్ మూర్తి, పురోహితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు క్షేత్రప్రాశస్త్యాన్ని వివరించి.. వేదాశీర్వచనాలు అందించారు. ఈవో, చైర్మన్ స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని స్వామివారిని మంత్రి వేడుకున్నారు.
సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతుందని.. ఇంకా బాగా పురోభివృద్ధి సాధించాలని స్వామి వారిని ప్రార్థించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మల్లు నర్సింహారెడ్డి, శివకుమార్ ఉన్నారు.