మహబూబ్నగర్, నవంబర్ 22 : కరువుకు నిలయంగా మారిన తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల కాలంలో ఎప్పుడు ఎవరూ ఉహించనంత అభివృద్ధి జరిగిందని తెలిపారు. బొంబాయి అత్యధిక బస్సులు పెట్టి సాగనంపిన కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నేతలు గిప్పుడు వచ్చి మేము అభివృద్ధి చేస్తామంటే ప్రజలు ఎవరు నమ్ముతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ చుట్టూ అభివృద్ధి జరిగిందని, ప్రతిపక్ష పార్టీల నేతలకు తెలుసని, వారి అభివృద్ధి జరుగలేదని, ప్రజలకు మాయమాటలు చెప్పుతున్నారని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో 15 రోజులకు ఒక మారు తాగడానికి నీరు వచ్చేందని, నీరు వస్తుందంటే పనులు అన్ని బంద్ చేసుకొని వేచిచూసిన రోజులను శాశ్వితంగా దూరం చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆ సమస్యలను పరిష్కరించేందుకు తాము ముందుండి పరిష్కరించడం జరుగుతుందన్నారు. చిన్న పనులకు కూడా హైదరాబాద్కు వెళ్లి వచ్చే మనం అతి తక్కువ సమయంలోనే సకల సదుపాయాలను మహబూబ్నగర్లోనే ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
రాత్రి, పగలు శ్రమిస్తేనే మహబూబ్నగర్ అభివృద్ధి జరిగిందని, ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఎంతో ఉన్నతంగా మనం ముందుకు సాగుదామని సూచించారు. సీఎం కేసీఆర్ చల్లని చూపు మన మహబూబ్నగర్ మీద ఉంటే చాలని, ఏమి అడగబోనని, అడిగిన వాటి కంటే అత్యధికంగా మనకు అందుబాటులో ఉంచి మన శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ప్రతి క్షణం పరితపిస్తారని తెలుసన్నారు. బీజేపీ, కాంగ్రెసోళ్లు రౌడీలను పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని, ప్రజల మనస్సులకు చాలా దూరంగా ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా మునుముందు సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసుకుందామన్నారు. కలిసి కట్టుగా ఉండి అందరూ బీఆర్ఎస్కు మద్దతు తెలియజేసి భారీ మెజార్టీ అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, వారికి ఏ కష్టం వచ్చినా మీ వెంటే ఉండే బాధ్యత నాది అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి గతంలో బీఆర్ఎస్లోకి కూడా వచ్చి పోయారని, బీజేపీ పార్టీ వాళ్లు టిక్కెట్టు ఇస్తే అక్కడకు పోయి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అక్కడ ఉండి వారి పబ్బం గడుపుకుంటారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి పాకిస్తాన్ వాళ్లు అయితే అక్కడ ఇండియన్ వారైతే ఇక్కడ ఓటేయండి అంటూ ప్రచారం చేసి వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని,
గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోరని, గిప్పుడు అందరం మనం ఒక్కటే అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలి తప్పా కులమతాలకు విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే బుద్ధ్ది వారిదని విమర్శించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రతి క్షణం ప్రజల సంక్షేమ కోసమే పరితపించానని గుర్తు చేశారు. ఎక్కడ తిరిగిన ఏమి ఆలోచన చేసిన ప్రజలకు మంచి చేయాలనే తపన తప్పా తనకు మరేమిలేదన్నారు. మహబూబ్నగర్ అప్పుడు ఎట్లా ఉండేది. ఇప్పుడు ఎట్లా మారిందో గమనించాలని సూచించారు. కేసీఆర్ను మూడో సారి ముఖ్యమంత్రి చేసుకుందామని, మహబూబ్నగర్లోనూ గులాబీ జెండా ఎగరవేసి కేసీఆర్కు కానుకగా ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, మన్నె శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రి పీ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, జెడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇబ్రహీం, మున్సిపల్ ఛైర్మన్ కేసీ నర్సింహులు, నేతలు గోపాల్యాదవ్, శివరాజ్, మల్లు నర్సింహారెడ్డి, గంజి వెంకన్న, అన్వర్పాషా, ముత్యాల ప్రకాష్తోపాటు 56 కుల సంఘాల నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.