భూత్పూర్, ఆగష్టు 11 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు రావడంతో న్యాయం గెలిచిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు మంత్రి భట్టుపల్లిలోని 13వ ప్యాకేజీ వద్ద శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఆర్డీఎస్ను బద్దలుకొట్టి సాగునీటిని తీసుకుపోతున్నా అప్పటి జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కండ్లప్పగించి చూశారే తప్పా అడ్డుకోలేదని విమర్శించారు. కేంద్రం పీఆర్ఎల్ఐపై చిన్నచూపు చూసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కవోని దీక్షతో పోరాడి ప్రాజెక్టుకు అనుమతులు సాధించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.
పార్లమెంటులో పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పి.. ఇప్పటికీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టు పనులను పూర్తి చేసి జిల్లా ప్రజల స్వప్నాన్ని నెరవేరుస్తామన్నారు. రానున్న రెండు, మూడునెలల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సొంత జిల్లా ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో న్యాయస్థానంలో అనుమతులు పొందడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. న్యాయబద్ధంగా పనిచేస్తే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేవి కాదన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ఎన్ని రోజులకైనా న్యాయమే గెలుస్తుందన్నారు. ఇది రాష్ట్రం, పాలమూరు ప్రజలు సాధించిన గెలుపన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వలసల జిల్లాకు వరమిస్తే, జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఇతర రాష్ర్టాల నాయకులతో చేతులు కలిపి కోర్టులో కేసులు వేసి, పనులను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పీఆర్ఎల్ఐ పూర్తయితే జిల్లాకు 70టీఎంసీల నీరు వస్తుందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవ్వుతుందన్నారు. అనంతరం ప్రాజెక్టులోని నీటితో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వాల్యానాయక్, రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ఎంపీపీ శేఖర్రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ బస్వరాజ్గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, మత్స్యసహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, సర్పంచు ఆంజనేయులు, కౌన్సిలర్లు, నాయకులు నారాయణగౌడ్, సాయిలు, సత్యనారాయణ, అశోక్గౌడ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.