పాలమూరు పర్యాటక హబ్గా మారిందని, ఐదేండ్లలో రూ.2,500 కోట్లతో పర్యాటకరంగంగా అభివృద్ధి చేశామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో రూ.125 కోట్లతో ఎనిమిది జిల్లాల్లో 15 చోట్ల వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్లో మహబూబ్నగర్లో స్వదేశీ, విదేశీ టూరిస్టులు వచ్చేలా విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. మన్యంకొండ రోప్వేను నిర్మిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పర్యాటక రంగానికి అభివృద్ధి చేస్తున్నామనన్నారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐదేండ్లలో పర్యాటకరంగం అభివృద్ధికి రూ.2,500కోట్లు ఖర్చు చేశామని, రాబోయే రోజుల్లో తెలంగాణకు విదేశీ టూరిస్టులు వచ్చేలా విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రూ.125కోట్లతో ఎనిమిది జిల్లాల్లో 15చోట్ల వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా మంత్రి శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ వేదికగా ఈ పనులన్నింటినీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పర్యాటక రంగానికి కొత్త హంగులు దిద్దుతూ విదేశీ పర్యాటకులను తెలంగాణకు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. గతంలో టూరిజం శాఖకు ఓల్వో, ఏసీ బస్సులు లేకుండేవని, ఈ ఐదేండ్లలో టూరీజంను అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా అత్యధిక బోట్లు, బస్సులు కొనుగోలు చేసి టూరిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో ఏకో, మెడికల్, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మహబూబ్నగర్ ఒకప్పుడు వలసల జిల్లాగా పేరుగాంచిందని, ఇక్కడకు రావాలంటే ఆలోచించే వాళ్లన్నారు. ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతోపాటు తెలంగాణలోనే తొలిరోప్వే మణ్యంకొండలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకోపార్కు, పట్టణ సమీపంలో జంగిల్ సఫారీ, పిల్లలమర్రి వద్ద మ్యూజియంతోపాటు కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను కూడా పర్యాటక ప్రదేశాలుగా మారుస్తామన్నారు. భవిష్యత్లో విదేశీ టూరిస్టులు మన జిల్లాకు వచ్చేలా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్రంలో సుమారు ఏడు చోట్ల సస్పెన్షన్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామని, మరో నాలుగైదు చోట్ల బ్రిడ్జిలకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఆసియాలోనే అతిపెద్ద బుద్దవనాన్ని తీర్చిదిద్దామన్నారు. త్వరలో ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో కూడా డ్రోన్ షోలు నిర్వహిస్తామన్నారు. దేశంలో ఇతర రాష్ర్టాల్లో లేనట్లు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ఐదేండ్లలో 1,056 శాతం విదేశీ టూరీస్టుల రాక పెరిగిందన్నారు. రామప్ప టెంపుల్ను యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ ఆలయాన్ని పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తెలంగాణలో క్రీడా మైదానాలకు సుమారు 10వేల ఎకరాలను కేటాయించి ప్రతి గ్రామంలో నిర్మించడం జరిగిందన్నారు. భవిష్యత్తో ఒలింపిక్లో అత్యధికంగా తెలంగాణ క్రీడాకారులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామన్నారు. అక్కమహాదేవి గుహలను పర్యాటకంగా తీర్చుదిద్దుతామని అన్నారు.
పాలమూరు జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తు జీవో జారీ చేశారని.. అడిగిన వెంటనే కాలేజీ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు. కాలేజీ మంజూరుకు సంబంధించిన జీవో కాపీని మీడియాకు చూపించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సుమారు 30 ఎకరాల స్థలంలో కాలేజీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్లో ఇందులో చదివిన విద్యార్థులు ఇక్కడ ఐటీహబ్లోనే ప్లేస్మెంట్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుకి సహకరించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎండీ మనోహర్ తదితరులు పాల్గ్గొన్నారు.