వనపర్తి, ఫిబ్రవరి 7: నాడు వలసలకు నెలవుగా ఉన్న వనపర్తి.. నేడు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే అభివృద్దికి అడ్డాగా మారింది. జిల్లాకేంద్రానికి నలుమూలల తాళ్లచెరువు, నల్లచెరువు, అమ్మచెరువు, ఈదులచెరువులు ఉన్నా ఒకప్పుడు కేవలం వర్షాధారం నీటిపై ఆధారపడి ఉండేవి. ఎండాకాలం వస్తే తాగునీటికి కష్టాలు వర్ణణాతీతం. అలాంటి సమయంలో మంత్రి నియోజకవర్గానికి పక్కనే పారుతున్న కృష్ణాజలాలతో నింపి ఎండాకాలంలో సైతం చెరువులను నిండుకుండలా మార్చారు. అలాగే చెరువులను మినీ ట్యాంక్బండ్గా మార్చుతున్నారు. ఇప్పటికే తాళ్లచెరువు పనులు పూర్తి కాగా, నల్లచెరువు మినీ ట్యాంక్బండ్ పనులు 80శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే ఇక్కడ బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయడం వల్ల బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మచెరువు, మర్రికుంట చెరువుల మినీ ట్యాంక్బండ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ట్యాంక్బండ్గా రూపదిద్దుకోవడంతో పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్తోపాటు సరాదాగా సేదతీరుతున్నారు.
రెండు పట్టణాల ప్రజలకు..
జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత వనపర్తి పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రజలకే కాకుండా కొత్తకోట నుంచి జిల్లాకేంద్రానికి వచ్చే ప్రజలకు అందుబాటులో వనపర్తి మండలంలోని రాజపేట శివారులో అన్నిహంగులతో పార్కును ఏర్పాటు చేయిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో జయశంకర్ పార్కు ఏర్పాటుకు ఎకరా 20గుంటల స్థలం సేకరణతోపాటు రూ.20లక్షలతో నిర్మించేలా పనులు ప్రారంభించడంతో పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి.
అందరికీ అందుబాటులో..
వనపర్తి నుంచి కొత్తకోటకు రోడ్డులో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, మెడికల్ కళాశాల బాలుర హాస్టల్, పక్కనే రోడ్డు మార్గం నుంచి నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల రహదారి ఉండడం, దగ్గరలో మైనార్టీల కోసం ఏర్పాటు చేస్తున్న షాదీఖాన ఉంది. జిల్లాకేంద్రానికి సమీప దూరం కావడం, రెండు పట్టణాలకు మధ్యలో కావడం వల్ల ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
పార్కులో జయశంకర్ విగ్రహం
రాక్పార్కులో జయశంకర్ విగ్రహం ఏర్పాటుకు మంత్రి నిరంజన్రెడ్డి పూనుకున్నారు. హైదరాబాద్లోని అత్తాపూర్లో జయశంకర్ విగ్రహం తయారీ పనులను జనవరి 3న మంత్రి పరిశీలించారు. రాక్పార్కులో ప్రధానంగా వాకింగ్ట్రాక్, పిల్లల ఆటవస్తువులు, వృద్ధులు, వాకర్స్ కూర్చోవడానికి బెంచీలు, సహజసిద్ధంగా అనిపించే పక్షుల గూళ్లు, బొమ్మలను ఏర్పాటు చేసేలా అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. పార్కు పనులు పూర్తయితే రెండు పట్టణాల ప్రజలకు సెలవురోజుల్లో పర్యాటకపార్కుగా రూపుదిద్దుకుంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.