నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 2;వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆలయాలు కిటకిట లాడాయి. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయన సతీమణి వాసంతితో కలిసి సోమవారం వేకువజామున వనపర్తి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. అలాగే అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పాడిపంటలతో విరాజిల్లాలని కోరినట్లు మంత్రి తెలిపారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామునుంచే భక్తులు వైష్ణవాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఉత్తరాయణ కాలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.