గ్రామగ్రామానా దశాబ్ది ఉత్సవాలు హోరెత్తాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మదిలో వేడుకలు నాటుకుపోవాలన్నారు. ప్రజలకు గతానికి.. ఇప్పటికి అభివృద్ధిలో తేడాను వివరించాలన్నారు. రైతువేదికలను ప్రజావేదికలుగా వినియోగించుకోవాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి,కంది పంటలను సాగుచేసి ఆదాయం గడించాలన్నారు. రైతు దినోత్సవం రోజున ఎడ్ల బండ్లపై వచ్చేందుకు ఆసక్తి చూపాలన్నారు.
గద్వాల, మే 31 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం సమీపంలోని సీఎన్జీ ఫంక్షన్హాల్లో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సాధించిన ప్రగతిని అధికారులు వివరించారు. సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ వల్లూరు క్రాంతి, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్ఫూర్తి నింపడానికి దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన కల్పించేలా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన అభవృద్ధి, రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించాలని చెప్పారు. మొదట రైతు దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా రైతు వేదికలు శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎడ్లబండ్లపై కార్యక్రమానికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని, దీని ద్వారా రైతుల్లో మరింత స్ఫూర్తి నింపిన వాళ్లమవుతామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు లక్ష మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం రైతుబీమా అందించి వారి కుటుంబాలకు అండగా నిలబడి, రైతు సమస్యలు పట్టని అవగాహన లేని కొందరు సన్నాసులు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం విచారకరమని అన్నారు. తెలంగాణలో రైతు మరణాలు తగ్గాయని కేంద్రం చెప్పిందని, ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,603 రైతువేదికలు నిర్మించామని, అందులో 2,601 రైతు వేదికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అమరులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జర్నలిస్టులకు ఈ దశాబ్ది ఉత్సవాల్లో సాధ్యమైనంత మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోలాని కలెక్టర్కు సూచించారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పండుగలా నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలపై రూపొందించిన క్యాలెండర్ ప్రకారం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, ఎస్పీ సృజన, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, రాష్ట్ర వినియోగదారుల ఫో రం చైర్మన్ గట్టుతిమ్మప్ప, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్ తదితరులు పాల్గొన్నారు.