ఉండవెల్లి, జనవరి 11 : పాల ట్యాంకర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన ఘటన అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకున్నది. స్థానికులు, వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ఉత్తర ఫుడ్స్ దగ్గర హైవే సిబ్బంది రమేశ్(వాహన డ్రైవర్), సీతారాముడు, లక్ష్మీదేవమ్మ, సుధాకర్, సతీశ్, ఆనంద్బాబు డివైడర్పై ఉన్న గడ్డిని తొలగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం రమేశ్, సీతారాముడు, సుధాకర్, లక్ష్మీదేవమ్మ స్లో మూవింగ్ వాహనం నిలిపి హైవే రోడ్డుపై సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న పాల ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ రమేశ్(ఉండవెల్లి), సీతారాముడు(పుల్లూరు) మృతి చెందారు. లక్ష్మీదేవమ్మ, సుధాకర్కు రక్తగాయాలు కావడంతో వైద్య సిబ్బంది చికిత్స నిర్వహిస్తున్నారు. మృతులు రోజువారి కూలీలు కావడంతో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కర్నూలు దవాఖానకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. హైవే అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.