మిగ్జాం.. ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. ఏపీ, తమిళనాడును అతలాకుతలం చేస్తున్న ఈ తుఫాన్ ప్రభావంతో ఐదు జిల్లాల్లోనూ అక్కడక్కడా ముసురు పడుతున్నది. మరో 24 గంటల పాటు ఉండనుండడంతో ప్రజలతోపాటు రైతులూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నాగర్ కర్నూల్కు ఎల్లో అలర్ట్ ప్రకటించగా వనపర్తితోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు సూచించారు. చలి గాలులకు చిరుజల్లులు తోడవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. వరి కోత దశలో ఉండడంతో రైతులు అప్రమత్తమయ్యారు. మార్కెట్లకు విక్రయానికి వచ్చిన ధాన్యపు రాశులపై టార్ఫాలిన్ కవర్లను కప్పి ఉంచారు. వంగూరు, కోడేరు,
ఊట్కూరు మండలాల్లో కురిసిన వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి.
నాగర్కర్నూల్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ) : చలికాలంలో మిగ్జాం తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. ఏపీ, తమిళనాడులో ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తూ వరదలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి అక్కడక్కడా ముసురు కురుస్తున్నది. ఈసారి వానకాలంలో ఆశించిన వర్షాలు కురవలేదు. పదిహేను రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాపారాలు త్వరగానే మూతపడుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి ఎక్కువగా రావడం లేదు. ఈక్రమంలో మిచౌంగ్ తుఫాన్ రెండ్రోజులుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. పలు గ్రామాల్లో ముసురు వర్షానికి విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర చలితో ఇండ్లకే పరిమితమవుతున్నారు.
ఈ తుఫాన్ వల్ల ఉమ్మడి పాలమూరులోని నాగర్కర్నూల్కు ఎల్లో అలర్ట్ ప్రకటించగా వనపర్తితోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈ వర్షాలకు వరి రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం చేతికొచ్చి ఎండబెట్టుకొని మార్కెట్కు తీసుకెళ్లే సమయంలో తుఫాన్ ప్రభావం చూపనున్నది. దీంతో ధాన్యంపై టార్ఫాలిన్ కవర్లు కప్పి ఉంచాలంటున్నారు. తడిసిన ధాన్యానికి తేమ ఉంటే గిట్టుబాటు ధరపై ప్రభావం పడుతుంది. కాగా ఓవైపు ముసురు, మరోవైపు చలితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నట్లుగా వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు స్వెట్టర్లు ధరించాలని, వేడి ఆహారం భుజించాలని, బయట తిరగరాదని సలహాలిస్తున్నారు. ఈ తుఫాన్ మరో 24గంటలు ప్రభావం చూపించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఆందోళనలో అన్నదాత..
వంగూరు, డిసెంబర్ 5 : చేతికొచ్చిన వరి పంట మిగ్జాం రూపంలో వచ్చిన తుఫాన్ ధాటికి నేలకొరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి అధికమొత్తంలో సాగు చేశారు. పంట కోత దశలో ఉండగా రాకాసి తుఫాన్ రైతన్నను నిండా ముంచింది. కేవలం 30శాతం పంటను కోయగా మిగిలిందంతా నేలపైనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపుగా పెరిగిన పంట నేలమట్టమైంది. వర్షం ఇలాగే కొనసాగితే ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. వంగూరుతోపాటు గాజర, తిప్పారెడ్డిపల్లి, ఉమ్మాపూర్, డిండిచింతపల్లి, మిట్టసదగోడు, ఉల్పర, పోతారెడ్డిపల్లి, రంగాపూర్, కొం డారెడ్డిపల్లి, నిజాంబాద్, తిరుమలగిరితోపాటు పలు గ్రామా ల్లో కోత మిషన్లు తీసుకొచ్చే సమయానికి తుఫాన్ వారి ఆశలపై నీల్లు చల్లింది.
నేలకొరిగిన వరిపంట
కోడేరు, డిసెంబర్ 5 : మిగ్జాం తుఫాను ప్రభావం వల్ల కోడేరు మండలంలో మంగళవారం ఉదయం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు వరిపంట దెబ్బతిన్నది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి చేతికి వచ్చే సమయంలో నేలకొరగడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షంతో పంట మునుగుతున్నది. ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం పడుతున్నందునా కోతలు కోసినా వరి ధాన్యాన్ని ఆరబెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ముసురు వర్షానికి గింజలు మొలకెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుఫాన్ కలవరం..
ఊట్కూర్, డిసెంబర్ 5 : తుఫాన్ ప్రభావం అన్నదాతలను కలవర పెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం ప్రభావంతో రెండ్రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని నదీతీర ప్రాంతాలతోపాటు చెరువులు, కుంటలు, బోరుబావుల కింద సాగైన వరి పంటలను రైతులు కోస్తున్నారు. మంగళవారం జల్లులు కురవగా కోత పెట్టిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షానికి గింజలు నేలరాలే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరో పక్క పత్తి పంట చివరి దశకు చేరగా తుఫాన్ ప్రభావంతో నల్లబారుతుందని, దీంతో ధర మరింత తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన వరి, పత్తి పంటలను ఇంటికి తరలించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు.