రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘చెప్పేది కొండంత.. చేసేది గోరంత’ అన్న నానుడి మాటను నిజం చేస్తున్నది. యాసంగి పంట పెట్టుబడికి వారిచ్చే రైతుబంధు సాయాన్ని చూసి కర్షకులు విస్తుపోతున్నారు. నాలుగు రోజులుగా రేవంత్ సర్కారు అందిస్తున్నది కేవలం అరకొర సాయమే.. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లాలో ఓ రైతుకు ఒక్క రూపాయి జమ కావడం సంచలనం కలిగిస్తున్నది. చెప్పిన మూడ్రోజుల తర్వాత రైతుబంధు డబ్బులు పడ్డట్టు సెల్ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసి ఓ రైతు అవాక్కయ్యాడు. హన్వాడకు చెందిన పాండురంగారెడ్డి అనే రైతుకు అక్షరాలా ఒక్క రూపాయి పడడంతో ఖంగుతిన్నాడు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండుసార్లు ఎకరాకు రూ.10 వేల చొప్పున పడేదని, ఐదెకరాల పొలం ఉండి
రూపాయి మాత్రమే పడడంతో బిత్తరమొఖం వేయడం సదరు రైతు వంతైంది. అలాగే టంకరకు చెందిన మరో రైతు ఆంజనేయులుకు సైతం రూ.62 జమైనట్లు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. తనకు రెండుగుంటల భూమి ఉండగా. గతంలో రూ.250 పడేదని చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వ ఘనకార్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పెట్టుబడికి అప్పులు చేయడం తప్పదని వాపోయారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగుకు సాయంగా రైతుబంధు పడుతుందని ఆశతో ఉన్న రైతాంగానికి రేవంత్ సర్కార్ ఝలకిస్తోంది. యాసంగి సాగుకు కేసీఆర్ సర్కార్ ఇచ్చినట్లే రైతుబంధు జమ చేస్తామని ప్రకటించి ఆరు రోజులైనా ఇంకా రైతుల ఖాతాల్లోకి టింగ్.. టింగ్మంటూ మెసేజ్లు రావడం లేదు. ఐదెకరాలలోపు రైతాంగానికి ఇవ్వాలని ఆదేశించినప్పటికీ అరకొరగా రైతుబంధు పడుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో ఓ రైతుకు రైతుబంధు ఒక్క రూపాయి పడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ లెక్కలో ఒక్క రూపాయి వేశారో అర్థం కావడం లేదని ఆ రైతు వాపోతున్నాడు. మరికొంత మందికి రూ.100లోపే రైతుబంధు డబ్బులు పడడం విస్తు గొలుపుతున్నది. దీంతో రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. ఎకరాకు రూ.15వేలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ముఖం చాటేస్తున్నదని రైతన్నలు విమర్శిస్తున్నారు. యాసంగి సాగు దగ్గర పడుతున్న కొద్దీ రైతుబంధుపై ఆశ పెట్టుకున్న వేలాది మంది రైతుల్లో గుబులు రేగుతోంది. ఇక అప్పు తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 55,184 మందికి రూ.11.38కోట్లు, నారాయణ పేట జిల్లాలో 27వేల మందికి రూ.5 కోట్ల 75 లక్షలు, గద్వాల జిల్లాలో 20,229 మందికి
రూ.4కోట్ల 59లక్షల 8,979, నాగర్కర్నూల్ జిల్లాలో 54,900 మంది రైతులకు రూ.12.45 కోట్లు రైతుబంధు జమ అయ్యింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కేవలం రూ.25కోట్లు మాత్రమే జమ అయ్యాయి. ఈనెల 13 నుంచి రైతుబంధు ఐదెకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు వారి ఖాతాలో జమ చేస్తున్నారు. కాగా, చాలామంది రైతులకు పొంతనలేని విధంగా డబ్బులు పడుతుండడంతో అయోమయంలో పడ్డారు. గతంలో 11సార్లు రైతుబంధు గుంటల్లోనే పడినప్పటికీ ఈసారి మాత్రం రైతులకు అరకొర డబ్బులు పడుతున్నాయి. దీంతో అయమయంలో రైతులు వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో ఓ రైతుకు రైతుబంధు కింద ఒక్క రూపాయి జమ కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మూడు రోజుల తర్వాత రైతుబంధు డబ్బులు పడినట్లు వచ్చిన మెసేజ్ చూసి అవాక్కయ్యాడు. హన్వాడ మండలానికి చెందిన పాండు రంగారెడ్డికి ఐదెకరాల పొలం ఉండగా, కేవలం ఒక్క రూపాయి రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తమకు రైతుబంధు ఏడాదికి రెండుసార్లు ఎకరానికి రూ.10వేల చొప్పున జమ చేసేదని, ఈసారి కేవలం ఒక్కరూపాయి పడడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలోని టంకరకు చెందిన ఆంజనేయులుకు కూడా రూ.62 రైతుబంధు డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇతనికి రెండు గంటల భూమి ఉంది. ప్రతిసారీ రూ. 250 పడేవి. ఈసారి కేవలం రూ.62 పడడంతో అర్థంకాని పరిస్థితి నెలకొంది. తనకు ఇంకా ఎకరన్నర భూమి వేరే సర్వేనెంబర్లో ఉన్నదని, ఇంకా డబ్బులు పడలేదని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మారగానే రేవంత్ సర్కార్ రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో ముందుగా ఐదెకరాలలోపు రైతులకు జమ చేయడం ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు, తర్వాత మిగతా వారికి రైతుబంధు డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పినా పూర్తిస్థాయిలో జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ రైతుబంధు వస్తుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. గత నెలలోనే కేసీఆర్ సర్కారు జమచేస్తామంటే కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు వేయొద్దని ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ రెండు రోజులు ఉందనగా ఈసీ రైటుబంధుకు అనుమతి ఇవ్వగా, మళ్లీ అడ్డుకోవడంతో రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కొత్త సర్కార్ వచ్చాక రైతులు రైతుబంధుపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.15వేలు ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ చివరికి పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు మొగ్గుచూపారు. ఇచ్చే డబ్బులు ఇప్పటికీ రాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.