నాగర్కర్నూల్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తూ భిన్న రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన మర్రి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నాగర్కర్నూల్ను తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే సామాజిక సేవలోనూ తనదైన శైలిలో అడుగులు వేస్తూ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఎంజేఆర్ ట్రస్టు ద్వారా ఇప్పటికే 700కుపైగా సామూహిక వివాహాలు జరిపించారు. నిరుద్యోగ యువతకు పోలీసు, గ్రూప్స్, ఉపాధ్యాయ కొలువులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిచడంతోపాటు స్టడీ మెటీరియళ్లను సైతం అందజేశారు. విద్యార్థులు, క్రీడాకారుల ఉన్నతికి దోహదపడుతున్నారు. ఇటీవలే 18ఏండ్లు నిండిన యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు.
నియోజకవర్గంలో ఈ లైసెన్సుల కోసం 15వేల మంది దరఖాస్తు చేసుకోగా, రూ.4.50కోట్లను ఇందుకోసం ఎమ్మెల్యే వెచ్చించనున్నారు. ఇక ప్రభుత్వం మంజూరు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కుల పంపిణీలోనూ చీరెలను సారెలుగా ఇస్తుండటం, సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా జరుగుతోంది. ఈ సామాజిక సేవలో తన సతీమణి, ట్రస్టు డైరెక్టర్ జమున క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేకు తోడుగా నిలుస్తున్నారు. ఇదేక్రమంలో తాజాగా రూ.5కే కడుపు నిండా భోజనం పెట్టే బృహత్తక కార్యక్రమానికి అంకురార్పణ చేపట్టారు. ఏ ఇతర సంస్థలు, వ్యక్తుల ప్రమేయం లేకుండా సొంతంగా మర్రి అన్న క్యాంటీన్ పేరిట పేదలకు రూ.5కు తిన్నంత భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ కార్యాలయం స్థలంలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఈ క్యాంటిన్ 23వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ 500నుంచి 1000మంది వరకు భోజనం అందించనున్నారు. ఈ క్యాంటీన్లోనూ పప్పు, రసంతోపాటు రోజుకు ప్రత్యేక కూర, పచ్చడిని అందించనున్నారు. క్యాంటీన్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఒకవేళ భోజ నం అయిపోతే 10 నుంచి 20నిమిషాల్లోనే వండేలా ఆధునిక స్ట్రీమింగ్ వంట పరికరాలను తీసుకొచ్చారు. భోజనం ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా కేంద్రానికి ప్రతిరోజూ వందల సంఖ్యలో పేదలు వచ్చి వెళ్తున్నారు. ఈ పేదలకు మర్రి అన్న క్యాంటీన్ సొంతింటి రుచి ని తలపించేలా భోజనం అందించనున్నది. అభివృద్ధితోపాటు సొంతంగా సామాజిక సేవ చేస్తూ ఎమ్మెల్యే మర్రి వేస్తున్న అడుగులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
పేదల సంతోషమే నా కడుపు నింపుతుంది..
నేనూ ఆకలితో పస్తులున్న పేద కుటుంబం నుంచే వచ్చా ను. పేదలు కడుపు నిండా అ న్నం తిని, సంతోషంగా ఉంటే నా కడుపు నిండిన తృప్తి కలుగుతుంది. ఎమ్మెల్యే పదవి ప్రజల చలువ. పేదలకు ఎంత సేవ చే సినా తక్కువే. రాజకీయాలతో సంబంధం లేకుండా బతికున్నంత కాలం ప్రజలకు సేవ చేస్తా. సామూహిక వివాహాలు, నిరుద్యోగ యువతకు శిక్షణ, వసతి, భోజనం, విద్యార్థులు, క్రీడాకారులకు ఆర్థికసాయం చేయడంతోపాటు ఇటీవలే నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ లైసెన్సులు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా. త్వరలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నా. ఈనెల 23న క్యాంటీన్ ప్రారంభిస్తాం.
– మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే