వనపర్తి, మార్చి 22(నమస్తే తెలంగాణ) : ఐదు నెలలుగా తాసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టకపోవడంతో ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములను అమ్ముకున్న వారితోపాటు ధరణి పోర్టల్తో అవసరమున్న వారంతా అవస్థలు పాలవుతున్నారు. రిజిస్ట్రేషన్ పక్రియ నిలిచిపోవడంతో భూములు అమ్ముకున్న వారికి సకాలంలో డబ్బులు అందక కొన్ని శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కొత్తగా ఏర్పడిన ఏదుల మండలంలో చోటు చేసుకున్నది.
వనపర్తి జిల్లాలోని గోపాల్పేట మండలంలో ఉన్న ఏదులను 2023 అక్టోబరులో కేసీఆర్ ప్రభుత్వం కొత్త మండలంగా ప్రకటించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములను కోల్పోయి. ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో గ్రామస్తులు అందించిన సహకారానికి అప్పటి ప్రభుత్వం కూడా అంతే ప్రాధాన్యతను కనబర్చిన క్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో ఏదుల కొత్త మండలంగా ఏర్పాటైంది. ఎనిమిది గ్రామాలతో ఏర్పడిన కొత్త మండలానికి మూడు గ్రామాలు ఏదులతోపాటు చెన్నారం, చీర్కపల్లి గోపాల్పేట మండలం నుంచి మరో అయిదు గ్రామాలు సింగాయిపల్లి, రేకులపల్లి, మాస్పల్లి, ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నెలను కోడేరు మండలం నుంచి కలిపారు. ప్రస్తుతం తాసీల్దార్ కార్యాలయాన్ని ఏదుల పాఠశాల ఆవరణలోని ఓ భవనంలో కొనసాగిస్తున్నారు.
కొత్త మండలం ఏదులలో కలిసిన ఐదు గ్రామాల ప్రజలు రెవెన్యూ శాఖ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోడేరు మండలం నుంచి ఏదుల మండలంలోకి కలిపిన తుర్కదిన్నె, సింగాయిపల్లి, మాస్పల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లి గ్రామాల్లోని రైతు లు ప్రధానంగా భూ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల్లోని భూములను అమ్ముకున్న రైతులకు రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నిలిచింది. గడిచిన ఐదు నెలల్లో జరిపిన క్రయ విక్రయాలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ప్రారంభంలో విద్యార్థులకు వివిధ సర్టిఫికెట్ల జారీ సహితం నిలిచిపోగా, వాటిని మాత్రం మళ్లీ కోడేరు మండల కార్యాలయంలో తీసుకునే విధంగా పునరుద్ధరించారు. ఇక భూములకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు, ధరణి పోర్టల్ ద్వారా చేసుకునే పనులన్నీ కూడా నిలిచిపోయాయి. పిల్లల పెండ్లిళ్ల్లు తదితర అవసరాల కోసం అమ్ముకున్న భూముల లావాదేవీలకు సహితం బ్రేకులు పడటంతో చాలా మంది శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు.
భూ సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్కు గడువు ఇచ్చింది. అందులోనూ ఈ ఐదు గ్రామాలకు సంబంధించిన పనులన్నీ నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇటు పాత మండలం కోడేరు.. అటు కొత్త మండలం ఏదులతోపాటు వీటికి అదనంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వనపర్తికి రెవెన్యూ బాధితులు చక్కర్లు కొట్టక తప్పడం లేదు. ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడైనా మా సమస్యలు తొలగించుకుందామంటే రెం టికి చెడ్డ రేవడిలా మా పరిస్థితి తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ఏదుల తాసీల్దార్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. కానీ కేవలం వనపర్తి జిల్లా పరిధిలో ఉన్న మూ డు గ్రామాలకు మాత్రమే రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి.
సింగాయిపల్లికి చెందిన వృద్ధురాలు శ్రీశైలమ్మ భూ సమస్య పరిష్కారం కోసం ఏదుల తాసీల్దార్ కార్యాలయానికి కూతు రు సాయంతో వచ్చింది. ఈమె కుటుంబంలో మొత్తం ఐదుగురు(భాగస్తులు) పాలివారు. అయితే, వీరి మధ్య కొన్నేండ్ల నుంచి భాగపరిష్కార సమస్య ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం భూ సమస్యల సవరణలకు అవకాశం కల్పించడంతో ఆమె కోడేరు మండలానికి వెళ్లింది. అక్కడి అధికారులు మీ మం డలం ఏదుల అని చెబితే.. తిరిగి కొత్త మండలానికి వచ్చి తా సీల్దార్తో ఆమె సమస్యను మొర పెట్టుకున్నది. అంతకుముందే వనపర్తి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వచ్చిన ఆమెకు ఇన్ని కార్యాలయాల చుట్టూ తిరగడంతో అసలు సమస్యను మరిచిపోయేలా అయ్యింది. తను కొన్నేండ్ల నుంచి భాగపరిష్కార సమస్యను పరిష్కరించుకుందామంటే ఇన్ని అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నది. చివరకు భాగపరిష్కార సమస్య పరిష్కారం కోసం కొత్త మండలం ఏదులకు వెళ్లగా తాసీల్దార్ సింగాయిపల్లికి సంబంధించిన రెవెన్యూ భూముల సమస్యలు అమలు కావడం లేదని చెప్పడంతో చేసేదిలేక నిరాశతో వెనుదిరిగింది
మేం ఎకర పొలం అమ్ముకున్నాం. ప్రారంభంలో కొంత నగదు తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్నాం. మిగితా డబ్బులను రిజిస్ర్టేషన్ చేసిన వెంటనే ఇచ్చే విధంగా మాట్లాడుకున్నాం. డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ రిజిస్ర్టేషన్లు కావడం లేదు. కోడేరుకు వెళ్తే ఏదులకు వెళ్లమన్నారు. ఏదులకు వెళితే కోడేరు నుంచి అన్ని రికార్డులు రాలేదు రిజిస్ట్రేషన్లు చేయడానికి రాదన్నారు. రెండు చోట్లకు తిరగడం తప్పా మా పనులు మాత్రం కావడం లేదు.
రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నిలిచి పోవడంతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. పొలం అమ్మిన రైతు డబ్బులు ఇవ్వమంటాడు. పొలం కొన్న రైతు రిజిస్ర్టేషన్ చేయమంటాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు మా ఐదు గ్రామాల సమస్యపై దృష్టి సారించాలి. ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కింద ధరణి ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎక్కడో ఒకచోట మాకు రిజిస్ట్రేషన్కు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.
ఏదుల కొత్త మండలంలో కోడేరు మండలం నుంచి వచ్చిన గ్రామాల భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ర్టేషన్లు కావడం లేదు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లాం. చాలా మంది రైతులు భూ సమస్యలపై వస్తున్నారు. ప్రభుత్వం నుంచి వస్తే తప్పా తాము నిస్సహాయులం. మిగిలిన మూడు గ్రామాల రిజిస్ర్టేషన్లు అవుతున్నాయి. దాదాపు నెల వ్యవధిలో 55వరకు రిజిస్ర్టేషన్లు చేశాం. సాంకేతిక సమస్య తొలగితేనే పరిష్కారం లభిస్తుంది.